పాలకుర్తి రూరల్, డిసెంబర్ 19: ధాన్యం కొనుగోళ్లతోపాటు రాష్ర్టానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపై తాడోపేడో తేల్చుకుంటామని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టంచేశారు. జనగామ జిల్లా పాలకుర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లల్లో కేంద్రం రెండు నాల్కల ధోరణిని అవలంబిస్తూ దొంగాట ఆడుతున్నదని మండిపడ్డారు. పలువురు కేంద్ర మంత్రులు ఓ మాట చెప్తే.. రాష్ట్రంలోని బీజేపీ నాయకులు మరొకలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం స్పష్టంగా చెప్తుంటే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తొండి మాటలతో వరి సాగు చేయాలంటూ రైతులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. రైతులను ఆందోళనకు గురిచేస్తున్న బీజేపీ నాయకులను ఉరికించాలని పిలుపునిచ్చారు. రాను న్న రోజుల్లో రైతులు, టీఆర్ఎస్ శ్రేణుల నుంచి బీజేపీకి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.
తెలంగాణ సర్కార్పై కక్షసాధింపు చర్యలు
తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ, విభజన హామీలను అమలు చేయడం లేదని మంత్రి ఆరోపించారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ వంటి పథకాలకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. తెలంగాణకు ఇంత అన్యా యం జరుగుతున్నా.. రాష్ర్టానికి చెందిన బీజేపీ ఎంపీలు పార్లమెంట్లో ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయమని చెప్తున్న నేపథ్యంలో రైతులు యాసంగిలో ఇతర పంటలు సాగు చేయాలని కోరారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు సోమవారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నాల్లో పార్టీ శ్రేణులు, రైతులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు చైర్పర్సన్ ఎర్రబెల్లి ఉషాదయాకర్రావు తదితరులు పాల్గొన్నారు.