హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను మచ్చిక చేసుకోవడంలో భాగంగా శనివారం సీఎం రేవంత్రెడ్డి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో భేటీ కానున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు, జూబ్లీహిల్స్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్హెచ్ఆర్డీ)లో అన్ని రకాల సంఘాల నేతలతో సమావేశం కానున్నారు. ఈ మేరకు సీఎంవో వర్గాలు పలు సంఘాలకు సమాచారాన్ని అందించాయి.
సీఎంగా రేవంత్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొన్ని సంఘాల నేతలు కలిశారు. మరికొన్ని సంఘాలు నేతలకు ఇప్పటివరకు సీఎంను కలిసే అవకాశం దక్కలేదు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ద్వారా ప్రభుత్వ పెద్దల ద్వారానే కలిసే అవకాశం దక్కగా, కొన్ని సంఘాలకు సీఎంను కలిసే అవకాశం దక్కకపోగా ఇది వారికి మింగుడుపడటం లేదు. స్థూలంగా ఇది వ్యతిరేకతకు దారి తీస్తుందని భావించిన సీఎం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ఆదివారం సమావేశం కావాలని నిర్ణయించారు. దాదాపు 70కి పైగా సంఘాలను ఈ సమావేశానికి ఆహ్వానించినట్టు తెలిసింది.
ఈ సమావేశంలో పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని సంఘాల నేతలు భావిస్తున్నారు. పీఆర్సీ కమిటీకి ఇటీవలే అన్ని సంఘాలు ప్రతిపాదనలు సమర్పించాయి. పీఆర్టీయూ 50, టీఎస్ టీఎన్జీవోలు 51 శాతం, టీజీవోలు 40 శాతం ఫిట్మెంట్ను కోరారు. ఫిట్మెంట్ సహా పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయడం, సీపీఎస్ రద్దు, బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని, జీవో-317తో నష్టపోయిన వారికి న్యాయం చేయడం, పెండింగ్ బిల్లులను జారీ చేయాలని, ఈహెచ్ఎస్ అమలు వంటి అంశాలను ప్రస్తావించాలని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి.