సంగారెడ్డి, ఫిబ్రవరి 20(నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సోమవారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం నారాయణఖేడ్ పట్టణానికి చేరుకొంటారు. రూ.4,427 కోట్లతో నిర్మించనున్న సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు పట్టణ శివారులో శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడే 1.30 లక్షల మందితో నిర్వహించనున్న బహిరంగ సభలో కేసీఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తరువాత కొద్దిసేపు టీఆర్ఎస్ జిల్లా నాయకులు, అధికారులతో ముచ్చటించి, సాయంత్రం హైదరాబాద్కు బయలుదేరుతారు.
సంగారెడ్డి జిల్లా అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నట్టు ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు పేర్కొన్నారు. కేసీఆర్తోనే జిల్లా పురోభివృద్ధి సాధ్యమని చెప్పారు. ఆదివారం ఆయన నారాయణఖేడ్లో సీఎం బహిరంగ సభా ఏర్పాట్లను ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, కలెక్టర్ హన్మంతరావు, ఎస్పీ రమణకుమార్తో కలిసి పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలతో సంగారెడ్డి జిల్లా అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గోదావరి జలాలను సింగూరు ప్రాజెక్టులో కలపడంతో జిల్లా ప్రజల సాగు, తాగునీటి అవసరాలు తీరుతాయని తెలిపారు. గోదావరి జలాలను సింగూరు ప్రాజెక్టులో కలుపడంతో హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఢోకా ఉండదని హరీశ్రావు స్పష్టంచేశారు.
సంగారెడ్డి జిల్లాలో మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు లేక సాగు, తాగు నీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడేవారు. సమస్యను గమనించిన కేసీఆర్ గోదావరి జలాలతో సస్యశ్యామలం చేయాలని సంకల్పించారు. మల్లన్నసాగర్ నుంచి సింగూరుకు జలాల ను తరలించే ప్రక్రియను చేపట్టారు. అక్కడి నుంచి సంగారెడ్డి, జహీరాబాద్, అందోలు, నారాయణఖేడ్ నియోజకవర్గాలకు నీటిని అందించేందుకు సంగమేశ్వర, బసవేశ్వర పథకాలను మంజూరుచేశారు.