Telangana Formation Day | ఒక సామూహిక స్వప్నం.. ఒక అస్తిత్వ సమరం.. దశాబ్దాల సంకెళ్లు తెంచి, స్వరాష్ర్టాన్ని సాకారం చేసింది. ఒక ఉద్యమకారుడి సారథ్యం.. ఒక దార్శనికుడి సంకల్పం.. కరువు నేలకు పచ్చదనాన్ని అద్ది, పూలతోటగా మార్చింది. ప్రగతిబాటలు పరిచింది. ఇది లాంగ్మార్చ్.. ఇది జైత్రయాత్ర. టార్చ్బేరర్ కేసీఆర్. 13 ఏండ్ల ఉద్యమ తెలంగాణ.. ఆపై 9 ఏండ్ల అభివృద్ధి తెలంగాణ.. అప్పుడూ ఇప్పుడూ దేశం నిబిడాశ్చర్యంతో చూస్తూనే ఉన్నది. ఒక్కొక్క మైలురాయిని దాటుతూ చరిత్రలో తెలంగాణ చెరగని పాదముద్రల్ని వేస్తున్నది. పసి తెలంగాణ, పసిడి తెలంగాణై పరుగులు తీస్తున్న వేళ.. ఇది దశాబ్ది సంరంభం.
రాష్ట్ర అవతరణ దశాబ్ది సంబురాలకు సర్వంసిద్ధమైంది. 21రోజులపాటు జరుగనున్న వేడుకలను ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రారంభించనున్నారు. తెలంగాణ ఉద్యమ అమరులకు ఘన నివాళులర్పించనున్నారు. రాష్ట్ర ప్రగతికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన సచివాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి, రాష్ట్ర ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు.
హైదరాబాద్, జూన్1 (నమస్తే తెలంగాణ): నాటి పాలకుల కుట్రలు ఛేదిస్తూ.. అమరుల త్యాగాల స్ఫూర్తితో మూడున్నర కోట్ల ప్రజలు కలబడి, నిలబడి, పోరాడి సాధించుకొన్న తెలంగాణ పదో వసంతంలోకి అడుగిడుతున్నది. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఏర్పడిన రాష్ట్రం..కేవలం తొమ్మిదేండ్లలోనే లక్ష్యాలకు మించిన ప్రగతితో దూసుకుపోతున్నది. ఈ నేపథ్యంలో వ్యవసాయం, విద్యుత్తు, తాగు, సాగునీరు, పల్లె, పట్టణాల అభివృద్ధి, విద్య, వైద్యం, పారిశ్రామికం, ఐటీ, ఆర్థిక ప్రగతి.. ఇలా ప్రతిరంగం విజయాన్నీ ప్రతిబింబించేలా దశాబ్ది ఉత్సవాలకు సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు రాష్ట్రం యావత్తు సమాయత్తమైంది. ఈ నెల 22వ తేదీ వరకు కొనసాగనున్న వేడుకలను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రారంభించనున్నారు. ఉదయం 10.30 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం తెలంగాణ అమరవీరులకు నివాళులర్పిస్తారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలు, స్మారక చిహ్నాలు, భవనాలను అధికారులు విద్యుద్దీపాలతో అలంకరించారు. త్రివర్ణ విద్యుద్దీపకాంతులతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం తళుకులీనుతున్నది. అలాగే, 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని రంగు రంగుల లైట్లతో అలంకరించారు. సచివాలయంలో ప్రారంభ వేడుకల ఏర్పాట్ల కోసం శాఖలవారీగా 13,398 అధికారులను నియమించడంతోపాటు అన్ని శాఖల నుంచి 7,250 మందిని వేడుకలకు ఆహ్వానించారు. వారికోసం 151 బస్సులను ఏర్పాటు చేశారు. వేడుకల సమన్వయం కోసం ప్రభుత్వం ఇప్పటికే నోడల్ అధికారులను కూడా నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా వేడుకల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు నేటి నుంచి 22వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ప్రతి రోజూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జూన్ 3న రైతు దినోత్సవం, 4న పోలీసు శాఖ సురక్షా దినోత్సవం, 5న విద్యుత్ విజయోత్సవం, సింగరేణి సంబురాలు, 6న పారిశ్రామిక ఉత్సవం, ఇండస్ట్రియల్ ఐటీ కారిడార్లలో సభలు, 7న సాగునీటి దినోత్సవం, 8న చెరువుల పండుగ, 9న సంక్షేమ సంబురాలు, 10న తెలంగాణ సుపరిపాలన దినోత్సవం, 11న సాహిత్య దినోత్సవం, 12న తెలంగాణ రన్, 13న మహిళా సంక్షేమ దినోత్సవం, 14న వైద్యారోగ్య దినోత్సవం, 15న పల్లెప్రగతి దినోత్సవం, 16న పట్టణ ప్రగతి దినోత్సవం, 17న గిరిజనోత్సవం, 18న మంచినీళ్ల పండుగ, 19న హరితోత్సవం, 20 విద్యా దినోత్సవం, 21న ఆధ్యాత్మిక దినోత్సవం, 22న అమరులకు నివాళి, స్మారక చిహ్నం ప్రారంభోత్సవంతో ఉత్సవాలు ముగియనున్నాయి.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం జిల్లాలవారీగా ఇన్చార్జిలను నియమించింది. జిల్లా ఇన్చార్జీలు ఆయా జిల్లాల్లో జాతీయ జెండాను ఎగరవేసి దశాబ్ది ఉత్సవాలను ప్రారంభించనున్నారు. ఆదిలాబాద్కు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, భద్రాద్రి కొత్తగూడేనికి ప్రభుత్వ విప్ కాంతారావు, జగిత్యాలకు మంత్రి కొప్పుల ఈశ్వర్, జయశంకర్ భూపాలపల్లికి రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, జనగామకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, జోగులాంబ గద్వాలకు డిప్యూటీ స్పీకర్ పద్మారావు, కామారెడ్డికి స్పీకర్ శ్రీనివాస్రెడ్డి, ఖమ్మంకు మంత్రి పువ్వాడ అజయ్కుమార్, కరీంనగర్కు మంత్రి గంగుల కమలాకర్, కుమ్రంభీం ఆసిఫాబాద్కు ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ, మహబూబ్నగర్కు మంత్రి శ్రీనివాస్గౌడ్, మహబూబాబాద్కు మంత్రి సత్యవతి రాథోడ్, మంచిర్యాలకు ప్రభుత్వ విప్ బాల్క సుమన్, మెదక్కు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, మేడ్చల్ మల్కాజిగిరికి మంత్రి మల్లారెడ్డి, ములుగుకు ప్రభుత్వ విప్ ప్రభాకర్రావు, నాగర్ కర్నూల్కు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, నల్లగొండకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, నారాయణపేటకు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి, నిర్మల్కు మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, నిజామాబాద్కు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, పెద్దపల్లికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్, రాజన్న సిరిసిల్ల జిల్లాకు మంత్రి కేటీఆర్, రంగారెడ్డి జిల్లాకు సబితా ఇంద్రారెడ్డి, సంగారెడ్డికి మంత్రి మహమూద్అలీ, సిద్దిపేటకు మంత్రి హరీశ్రావు, సూర్యాపేటకు మంత్రి జగదీశ్రెడ్డి, వికారాబాద్కు ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్శర్మ, వనపర్తికి మంత్రి నిరంజన్రెడ్డి, హనుమకొండకు ప్రభుత్వ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్కు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, యాదాద్రి భువనగిరి జిల్లాకు ప్రభుత్వ విప్ గొంగడి సునీతను ఇన్చార్జిలుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.