హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): చవితి వేడుకల సందర్భంగా గత కొన్ని రోజుల నుంచి మండపాల్లో విశిష్ట పూజలందుకున్న బొజ్జ గణపయ్యలకు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా శోభాయాత్రలు నిర్వహించి నిమజ్జనం చేయనున్నారు. హైదరాబాద్లో బాలాపూర్ నుంచి ట్యాంక్బండ్ వరకు శోభాయాత్రను కనులారా వీక్షించేందుకు వేలాదిగా భక్తులు తరలిరానున్నారు. ఖైరతాబాద్ పంచముఖ రుద్రమహాగణపతి నిమజ్జనం మధ్యాహ్నం 3 గంటల్లోపే పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని ప్రాంతాలతోపాటు అన్ని జిల్లాల్లోని నిమజ్జన కేంద్రాల వద్ద క్రేన్లను సిద్ధం చేసి, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. అన్ని నిమజ్జన పాయింట్ల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటన్నింటినీ మినీ కమాండ్ కంట్రోల్ సెంటర్లతో అనుసంధానించారు. డీజీపీ కార్యాలయంలోని కంట్రోల్ సెంటర్తోపాటు హైదరాబాద్, సైబరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ల నుంచి నిమజ్జన సరళిని పరిశీలించి సిబ్బందికి సూచనలు ఇవ్వనున్నారు.