తిమ్మాపూర్, ఫిబ్రవరి 2 : ఉద్యోగులు తమ హకులు, సమస్యలపై కొట్లాడే నైజం కోల్పోతున్నారని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ అన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీకాలనీలోని వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన నీటి పారుదల శాఖ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 80 ఏండ్లుగా ఉద్యోగుల హకుల కోసం టీఎన్జీవో పోరాటం చేస్తున్నదని గుర్తుచేశారు.
ఏదైనా సమస్యపై పిలుపునిస్తే ప్రస్తుతం ఉద్యోగులు రావడంలేదని విస్మయం వ్యక్తంచేశారు. త్వరలో శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. సమస్యల పోరాటంలో సంఘం ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. కొత్తగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను అభినందించారు. సమావేశంలో టీఎన్జీవో కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, నాయకులు పాల్గొన్నారు.