హైదరాబాద్: ఉద్యోగులకు ఒక శాతం చందాతో కూడిన నగదు రహిత ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావును కోరినట్లు టీఎన్జీవో అధ్యక్షుడు రాజేందర్ తెలిపారు. ఈ మేరకు ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి మంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చినట్లు చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. ఉద్యోగుల చందాతో కూడిన ఆరోగ్య కార్డుల పథకం అమలుకు రంగం సిద్ధం చేస్తున్నాం అని హరీశ్రావు తెలిపారు. ఉద్యోగ సంఘాల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన హరీశ్రావు ఈహెచ్ఎస్ అమలు చేయడం కోసం ఉత్తర్వులు ఇవ్వాలని హెల్త్ సెక్రటరీ రిజ్విని ఆదేశించారు.
ఇందులో ప్రధానంగా ఉద్యోగ, ఉపాధ్యాయుల, పెన్షనర్లు అందరూ నగదు రహిత వైద్య సదుపాయాన్ని అమలు చేయడం కోసం ఒక శాతం మూలవేతనంలో చందా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, అందుకు అనుగుణంగా ప్రభుత్వం కూడా తన వాటాగా నగదును ట్రస్ట్కు చెల్లించాలని కోరినట్లు రాజేందర్ తెలిపారు. అదేవిధంగా 317 జీవో అమలులో స్పౌస్ కేసుల ప్రక్రియను త్వరితగతిన చేపట్టాలని కోరామన్నారు.
ఉద్యోగులకు ప్రతి నెలా సకాలంలో జీతాలు, పెండింగ్ బిల్లులను విడుదల చేయానలి కోరినట్లు చెప్పారు. పెండింగ్ పీఆర్సీ జీవోలను విడుదల చేయాలని కోరామన్నారు. రాష్ట్రంలో 1-7-2023 నుంచి అమలు అయ్యేలా నూతన పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశామన్నారు.