హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : నూతనంగా ఏర్పడనున్న రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీవో) కేంద్ర సంఘం (TNGO )అభినందనలు తెలిపింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ( Congress) పార్టీ అధికారంలోకి రావడం హర్షం వ్యక్తంచేస్తున్నట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. పది లక్షల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల కుటుంబాల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం కలిసి పనిచేస్తామన్నారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమ పథకాల అమలు కోసం ఉద్యోగులుగా ప్రభుత్వంతో కలిసి సమన్వయం చేసుకుని ముందుకెళతామన్నారు. ఉద్యోగుల ఆకాంక్షల మేరకు నూతన ప్రభుత్వం మ్యానిఫెస్టోలో పలు అనుకూల నిర్ణయాలను ప్రకటించిందని, ఆయా మ్యానిఫెస్టో అమలుకోసం, ప్రభుత్వానికి అండగా ఉంటామన్నారు. నూతన ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయటంలో ప్రభుత్వ ఉద్యోగులుగా ముందుంటామని జగదీశ్వర్తో పాటు టీఎన్జీవో కేంద్ర సంఘం అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, సత్యనారాయణ గౌడ్, కోశాధికారి రామినేని శ్రీనివాస రావు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ హుస్సేని తదితరులు ఒక ప్రకటనలో తెలిపారు.