హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగులకు ఒక శాతం చందాతో కూడిన నగదు రహిత ఆరోగ్య పథకాన్ని(ఈహెచ్ఎస్) అమలు చేస్తామని బడ్జెట్లో ప్రకటించడంపై టీఎన్జీవో కేంద్ర సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు మంగళవారం ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును వేర్వేరుగా కలిసి కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, రాయకంటి ప్రతాప్ మాట్లాడారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎంతో కాలంగా వేచిచూస్తున్న నగదు రహిత ఈహెచ్ఎస్ పథకాన్ని ప్రవేశపెట్టడం సంతోషదాయకమని, దీంతో రాష్ట్రంలోని 6.5 లక్షల కుటుంబాలకు మేలు జరుగుతుందని అన్నారు. ఈహెచ్ఎస్ కోసం బడ్జెట్లో రూ.700 కోట్లను ప్రకటించడంపై వారు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. పీఆర్సీ సహా ఈహెచ్ఎస్ను ప్రకటించడం ఉద్యోగులపై సీఎం కేసీఆర్కు ఉన్న అమితమైన ప్రేమకు నిదర్శనమని కొనియాడారు.
ఈహెచ్ఎస్ విజయవంతంగా అమలు చేసేందుకు మార్గదర్శకాలు వెంటనే విడుదల చేస్తామని మంత్రి హరీశ్రావు పేర్కొన్నట్టు వారు తెలిపారు. వారి వెంట టీఎన్జీవో అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకట్, హైదరాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, ముజీబ్, విక్రమ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్, నగరశాఖ అధ్యక్షుడు శ్రీరామ్, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు పరమేశ్వర్, విక్రమ్రెడ్డి తదితరులు ఉన్నారు.
దేశంలోనే అద్భుత పథకం
రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లు కోరుకుంటున్నట్టుగా అందరి ఆకాంక్షల మేరకు కొత్త పథకాన్ని ప్రకటించడం హర్షణీయం. ఈహెచ్ఎస్ దేశంలో అద్భుతమైన ఆరోగ్య పథకం. ఇది యావత్తు దేశంలో ఉద్యోగుల సంక్షేమం కోసం రూపొందించిన ఉత్తమ పథకమవుతుంది. యావత్తు ఉపాధ్యాయ లోకం ఈ పథకాన్ని స్వాగతిస్తున్నది. రాష్ట్రప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు.
– బీరెల్లి కమలాకర్రావు, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఇక ఉద్యోగులకు నిశ్చింత
ఈహెచ్ఎస్ అమలుతో ఉద్యోగులు, పెన్షనర్లకు నిశ్చింత భరోసా దొరికినట్టయ్యింది. దీర్ఘకాలిక రోగాల బారిన పడ్డ ఉద్యోగులకు దవాఖానల్లో బిల్లుల బాధ తప్పుతుంది. నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమై, ప్రభుత్వ పథకాలను విజయవంతంగా ప్రజలకు అందజేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకంతో మంచి ప్రయోజనం చేకూరుతుంది.
– నోరి శ్రీనేశ్కుమార్, ప్రాంతీయ సైనిక సంక్షేమాధికారి