నయీంనగర్, నవంబర్ 24: బీజేపీ ఎస్సీ వర్గీకరణను చేపట్టకుండామాదిగలను మోసం చేస్తున్నదని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. గురువారం హనుమకొండలో రాజేశ్ ఖన్నా అధ్యక్షతన నిర్వహించిన ఎమ్మార్పీఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ 28 ఏండ్లుగా పోరాడుతున్నదని, దీనికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు కూడా ఇచ్చాయని తెలిపారు.
ఈ నేపథ్యంలోనే బీజేపీ కూడా 1997 నుంచి మద్దతిచ్చిందని, అనేక సభలలో ఆ పార్టీ నాయకుడు వెంకయ్యనాయుడు మాదిగల పోరాటానికి సంఘీభావం ప్రకటించారని గుర్తుచేశారు. తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లుకు పార్లమెంట్లో చట్టబద్ధత కల్పిస్తామని 2014 ఎన్నికల్లో బీజేపీ హామీనిచ్చి.. ఇప్పుడు దాని ఊసెత్తడం లేదని మండిపడ్డారు. నాడు అనేక సభల్లో వర్గీకరణకు మద్దతిచ్చిన ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్రెడ్డి హామీ నీటి మూట అయిందని విమర్శించారు. ఎనిమిదేండ్ల పాలనలో మాదిగలకు బీజేపీ చేసిందేమీ లేదని పేర్కొన్నారు. తెలంగాణలో అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీని మాదిగ ప్రజలు గ్రామ గ్రామాన నిలదీయాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వంగపల్లి కోరారు. సమావేశంలో హనుమకొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి విజయ్కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేదాసి మోహన్, జిల్లా అధికార ప్రతినిధి ప్రశాంత్, జిల్లా అధ్యక్షుడు చిన్నస్వామి, సుమన్, మధు, రూపస్టోని, ప్రవీణ్, సంజీవ, నవీన్, విజయకాంత్, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.