మషీరాబాద్, మార్చి 31: స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కులంపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని టీఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ విద్యానగర్లోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడారు. మాదిగ నేతను కాదని కడియం కావ్యకు కాంగ్రెస్ వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తే ఆ పార్టీని అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. మాదిగలను మోసం చేస్తూ, అణచివేస్తూ ఎదిగిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి కులం ఎంటో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నదని, ఆయన కులం విషయంలో మొదటి నుంచీ సందేహాలు ఉన్నాయని తెలిపారు. 30 ఏండ్లుగా మాదిగనని చెప్పుకున్న కడియం బీఆర్ఎస్లో చేరినప్పుడు బైండ్ల కులంగా చెప్పుకున్నారని తెలిపారు.
మాదిగ ఉప కులం అయినప్పటికీ మాదిగ కులంగా చెప్పుకొని తమ జాతి నేతల అవకాశాలకు అడ్డు తగిలారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో మోత్కుపల్లి నర్సింహులును ఎదుగకుండా కడియం శ్రీహరి కుట్ర చేశారని, బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మాజీ మంత్రి తాటికొండ రాజయ్యను ఎదగనీయలేదని, ఆయన పదవి పోవడానికీ కారకుడయ్యారని ఆరోపించారు. మాదిగలను కాదని బీఆర్ఎస్ స్టేషన్ ఘన్పూర్ టికెట్ ఇస్తే గెలిచి కాంగ్రెస్లో చేరిన కడియం, తన బిడ్డ కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఇప్పించుకోవడానికి మాదిగలకు టికెట్ దక్కకుండా అడ్డుపడుతూ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రాకు చెందిన ముస్లింను వివాహం చేసుకున్న కడియం కావ్యకు తెలంగాణతో ఏంపని అని వంగపల్లి ప్రశ్నించారు. మాదిగలను విస్మరిస్తే చంద్రబాబుకు ఏ గతి పట్టిందో భవిష్యత్తులో రేవంత్కూ అదేగతి పడుతుందని హెచ్చరించారు.