గోదావరిఖని, జనవరి 19: తెలంగాణలో దళితులపై కాంగ్రెస్ సర్కారు కపటప్రేమ చూపుతున్నదని, నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన దళితబంధు పథకాన్ని కొనసాగించాలని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ డిమాండ్ చేశారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో నిర్వహించిన టీఎమ్మార్పీఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. వేల సంవత్సరాలుగా సామాజిక వివక్షకు గురైన దళితుల బతుకుల్లో వెలుగులు నింపేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఈ బృహత్తర పథకాన్ని తెచ్చిందని గుర్తుచేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకం అమలుపై నిర్లక్ష్యం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. మాదిగలను ఓటు బ్యాంకుగా చూడకుండా సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో టీఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు యాసర్ల రాజ్కుమార్, కోర్ కమిటీ సభ్యుడు కొట్టెపల్లి దుర్గా ప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజు, ఎంఎస్ఎఫ్ నియోజకవర్గ ఇన్చార్జి ఈర్ల ప్రేమ్కుమార్, మేడి ప్రవీణ్, మాచర్ల శ్రీనివాస్, కుమ్మరి నవీన్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.