టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల
హైదరాబాద్, ఆగస్ట్ 11 (నమస్తే తెలంగాణ) : నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలోని ముడుమాల్లో ఉన్న ‘నిలువురాళ్ల’ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు, యునెసో గుర్తింపు సాధించేందుకు కృషి చేస్తామని తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల తెలిపారు. ‘నిలువురాళ్లు’కు 5000 ఏండ్ల చరిత్ర ఉన్నదని, ఆసియా ఖండంలోనే అత్యంత పురాతనమైన అస్ట్రోనామికల్ అబ్జర్వేటరీగా గుర్తింపు పొందిందని చెప్పారు. ఈ ప్రాంతం గురించి ఇటీవల స్థానికులు సందీప్ మక్తాల దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన బృందం బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించింది. నిలువురాళ్లపై పరిశోధనలు చేస్తున్న ప్రొఫెసర్ కేపీ రావుతో సమావేశమై ప్రాంత విశిష్టత గురించి సమగ్ర వివరాలు సేకరించారు. స్థానికులతోనూ చర్చించారు. నిలువురాళ్లను భద్రంగా కాపాడిన రైతు అంజప్ప, ఆయన కుటుంబ సభ్యులను ప్రశంసించి, సన్మానించారు. పర్యటనలో టీటా సభ్యులు సౌమ్య, శ్రీనివాస్ మర్రి, స్పందన, శ్రీనివాస్ రెడ్డి, గోపి, ప్రసాద్, శ్రీకాంత్ ఉప్పాల, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.