యాదాద్రి, నవంబర్ 1: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో స్వామి, అమ్మవార్లకు తిరువీధి సేవోత్సవం అత్యంత వైభవంగా సాగింది. మంగళవారం తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామి, అమ్మవార్లను మేల్కొలిపిన అర్చక బృందం, తిరువారాధన చేపట్టారు.
ప్రధానాలయ గర్భగుడిలో స్వయంభూ, ఉత్సవమూర్తులకు తీర్థం, పంచామృతాలతో అభిషేకం జరిపారు. అష్టోత్తరం నిర్వహించి, తీర్థ ప్రసాదాలు అందజేసి స్వామివారి నిజరూప దర్శనం భక్తులకు కల్పించారు. కార్తికమాసం సందర్భంగా సత్యనారాయణ వ్రతాలు అధిక సంఖ్యలో జరిగాయి. తెల్లవారుజామునుంచే మహిళలు దీపారాధనలో పాల్గొన్నారు. 148 మంది భక్తులు బ్రేక్ దర్శనంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొన్నారు. స్వామివారిని 15 వేల మంది భక్తులు దర్శించుకోగా, ఖజానాకు రూ.18,27,198 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు.