హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీశైలంలో జరిగే శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ తరపున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి తరపున టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వామి, అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. నాలుగో రోజైన సోమవారం మయూర వాహనంలో స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు.
సాయంత్రం మయూరవాహనంపై శ్రీశైలం పురవీధుల్లో స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహించారు. శివస్వాములతో శ్రీశైలం పోటెత్తింది. భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల పట్టువస్ర్తాలు సమర్పించిన అనంతరం టీటీడీ ఈవో ధర్మారెడ్డి కీలక ప్రకటన చేశారు. శ్రీశైలం దేవస్థానం స్థలం కేటాయిస్తే టీటీడీ దేవస్థానం తరపున రెండు వందల గదుల భవనం కడతామని ప్రకటించారు. క్షేత్రంలో టీటీడీ సత్రం పాతపడటంతో వాటిని ఆధునీకరిస్తామని చెప్పారు.