మే నెలలోనే రూ.130.29 కోట్లు
హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చరిత్రలోనే అత్యధిక హుండీ ఆదాయం ఈ ఏడాది మే నెలలో నమోదయ్యిందని, రూ.130.29 కోట్ల భారీ మొత్తం సమకూరిందని ఆలయ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం తిరుమల అన్నమయ్య భవన్లో నిర్వహించిన డయల్యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. మే నెలలో శ్రీవారిని 22 లక్షల 62 వేల మంది భక్తులు దర్శించుకున్నారని వివరించారు. కోటి 86 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయించామని తెలిపారు. టైంస్లాట్ సర్వదర్శన విధానాన్ని వేసవి సెలవులు ముగిసే వరకు ప్రారంభించలేమని వెల్లడించారు.
నేటి నుంచి శ్రీవారి జ్యేష్ఠాభిషేకం
ఈ నెల 11 నుంచి జ్యేష్ఠాభిషేకం సేవా టికెట్లు భక్తులకు అందుబాటులో ఉంటాయని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఈ నెల 12 నుంచి 14 వరకు 3 రోజులకు సంబంధించిన టికెట్లు కరెంట్ బుకింగ్లో అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. రోజుకు 600 చొప్పున సేవా టికెట్లను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఒక్కో టికెట్ ధర రూ.400గా నిర్ణయించింది. తిరుమలలోని సీఆర్వో కార్యాలయం కౌంటర్లో బయోమెట్రిక్ విధానం ద్వారా నమోదు చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. మొదట వచ్చిన వారికి మొదట అనే ప్రాతిపదికన టికెట్లు జారీ చేయనున్నారు.