భీంపూర్, నవంబర్ 30 : ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని తాంసి (కే), గొల్లగఢ్, పిప్పల్కోటి రిజర్వాయర్ ప్రాంతాల్లో నెల రోజులుగా పెద్ద పులి సహా మూడు పిల్లలు సంచరిస్తున్నాయి. బుధవారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో పిప్పల్కోటి నుంచి తాంసి(కే) వైపు వెళ్లే దారిలో రోడ్డు పక్కన బోర్లకుంట వద్ద పెద్దపులితోపాటు మూడు పులి పిల్లలు సేదదీరడాన్ని రిజర్వాయర్ పనులు చేస్తున్న కూలీలు గమనించి సెల్ఫోన్లో బంధించారు.
ఉదయం 6.30 గంటల ప్రాంతంలో మహారాష్ట్రలోని ఇవ్రీ గ్రామం వద్ద వీటి పాదముద్రలను గుర్తించారు. కేవలం గంట వ్యవధిలో నాలుగు కిలోమీటర్ల దూరంలోని పెన్గంగ దాటి ఇవ్రీ వెళ్లాయని ఎఫ్ఆర్వో గులాబ్సింగ్, ఎఫ్ఎస్వో ప్రేంసింగ్ ధ్రువీకరించారు. పులి పాదముద్రలను పరిశీలించినట్టు వారు పేర్కొన్నారు. ఇవ్రీ, చనాక, రాంనగర్ అటవీ మార్గం ద్వారా తిప్పేశ్వర్ అభయారణ్యం చేరుతాయని వెల్లడించారు. అయినప్పటికీ పులి సంరక్షణ చర్యలు యథావిధిగా కొనసాగుతాయని, ప్రజలు ఆందోళన చెందొద్దని వారు సూచించారు.
పూసపల్లిలో చిరుత సంచారం
ఇల్లెందు రూరల్, నవంబర్ 30: భద్రాద్రి జిల్లా ఇల్లెందు మండలం పూసపల్లిలో చిరుతపులి సంచారం ఏజెన్సీవాసులను కలవరపెడుతున్నది. మంగళవారం రాత్రి పూసపల్లి అటవీ ప్రాంతంలో మిర్చి తోటకు కాపలాగా ఉంచిన ఓ కుక్కను చిరుత చంపగా బుధవారం గ్రామస్థులు గుర్తించారు. అటవీశాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి చిరుత సంచరించినట్టు నిర్ధారించారు.