హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పులుల సంచారమే కాదు వాటి సంఖ్య కూడా పెరిగింది. ప్రభుత్వం చేపట్టిన అటవీ రక్షణ, పునర్జీవన చర్యలతో రాష్ట్రంలోని అడవులు పులులకు రక్షిత ప్రాంతాలుగా మారాయి. అడవుల్లో విస్తరించిన పచ్చిక బయళ్లు, నీటి లభ్యత కారణంగా వన్యజీవుల సంఖ్య విపరీతంగా వృద్ధిచెందింది. దీంతో తెలంగాణలోని అటవీ ప్రాంతాలు పులులకు అనువైన ఆవాసాలుగా మారి, వాటి సంఖ్య పెరిగింది. ఈ మేరకు రాష్ట్రంలో కొత్తగా మరో 5 నుంచి 6 పులులు పెరిగినట్టు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) ఇటీవల నిర్వహించిన జాతీయ పులుల గణన సర్వేలో అంచనా వేసింది. ఇప్పటికే అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో పులులు ఉండగా.. కిన్నెరసాని, పాకాల, ఏటూరునాగారం, ములుగు ప్రాంతాల్లోనూ పులులు ఉన్నట్టు ఎన్టీసీఏ గుర్తించింది. గత నెల 22న ప్రారంభమైన జాతీయ పులుల గణన తొలిదశ సర్వే ఈ నెల 3న ముగిసింది. తెలంగాణలో అటవీ రక్షణ, పునర్జీవన చర్యలను ఎన్టీసీఏ ప్రశంసించింది. ప్రస్తుతం అమ్రాబాద్లో 16, కవ్వాల్(కాగజ్నగర్) టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో 11 మొత్తం 26 పెద్ద పులులు ఉన్నాయి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల్లో పులుల సంఖ్య పెరిగి.. అక్కడ ఆవాసాల్లో ఇబ్బందులు తలెత్తడంతో తెలంగాణలోకి వలస వస్తున్నట్టు అధికారులు నిర్ధారించారు.