ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలంలోని కొలామా శివారు ప్రాంతంలో పులి సంచారం కలకలం రేపింది. గ్రామంలోని రాథోడ్ సఘన్లాల్కు చెందిన మేకల మంద ఇంటి సమీపంలోని పశువుల కొట్టంలో ఉండగా, మంగళవారం రాత్రి పులి దాడి చేసి ఒక మేకను ఈడ్చికెళ్లింది. మేకను పులి దాడి చేసి, చంపి తిన్నట్లుగా ప్రత్యక్ష సాక్షులు పవార్ కిషన్, సిడాం బహదుర్షావ్ తెలిపారు. ఘటనా స్థలంలో పులి పాదముద్రలను గుర్తించారు. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని అమ్రాబాద్ నల్లమల్ల అడవుల్లో నిన్న పెద్ద పులి కనిపించిన సంగతి తెలిసిందే. విధి నిర్వహణలో భాగంగా జిల్లా ఫారెస్ట్ అధికారి రోహిత్ రెడ్డి.. సోమవారం రాత్రి అడవిలో పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో వారికి పెద్ద పులి కనిపించింది. దీంతో ఫారెస్ట్ ఆఫీసర్ రోహిత్ రెడ్డి తన మొబైల్లో చిత్రీకరించి ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పులుల సంరక్షణ, అటవీ జంతువుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను నెటిజన్లు ప్రశంసించారు.