BJP | హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): తమది సిద్ధాంతాలతో నడిచే పార్టీ అని, తమ పార్టీలో సిద్ధాంతాలు తప్ప వ్యక్తులు ముఖ్యం కాదని చెప్పుకొనే బీజేపీ.. ఆచరణలో మాత్రం తాము ఇతర పార్టీలకు ఏమాత్రం ప్రత్యేకం కాదని స్పష్టమవుతున్నది. ఇప్పటికే ఆ పార్టీలో వ్యక్తిపూజ పరాకాష్ఠకు చేరుకోగా.. సిద్ధాంతాలకు నీళ్లొదలడం ఎప్పుడో మొదలైంది. ప్రస్తుతం ఆ పార్టీని శాసిస్తున్న నేతలు కేంద్రంలో అధికారంలోకి రావడానికి ముందు పార్టీలో 70 ఏండ్లు దాటిన వారికి బలవంతపు రిటైర్మెంట్ ప్రకటించి పదవులకు దూరం చేశారు. తాము మాత్రం 70 ఏండ్లు దాటినా పదవులను పట్టుకొని వేళ్లాడుతున్నారని ఆ పార్టీకి చెందినవారే విమర్శిస్తున్నారు. ఒకే కుటుంబం నుంచి రాజకీయాలలో ఉంటూ.. ప్రజా ప్రతినిధులుగా సేవలందించే వారిని కుటుంబ పాలన అంటూ విమర్శలు గుప్పించే బీజేపీ నేతలు ఇప్పుడు తాము కూడా ఇందుకు మినహాయింపు కాదని చాటుకుంటున్నారు.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపుతున్న అభ్యర్థుల్లో దంపతులకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తున్నది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజూరాబాద్ నుంచి పోటీ చేయాలని భావిస్తుండగా.. ఆయన భార్య జమున శేరిలింగంపల్లి లేదా మేడ్చల్ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు బీజేపీ శ్రేణులు చెప్పుకొంటున్నాయి. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి భార్య కావ్యారెడ్డి కూడా అసెంబ్లీ బరిలో దిగే ఆలోచనలో ఉన్నట్టు చెప్తున్నారు. మునుగోడులో సిట్టింగ్ స్థానానికి రాజీనామా చేసి, కమలాన్ని నమ్ముకుని పరాభవం పొందిన కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డికి ఎల్బీనగర్, ఆయన భార్య లక్ష్మికి మునుగోడు టికెట్లు కేటాయిస్తారని ప్రచారం జరుగుతున్నది. కరీంనగర్ నుంచి బండి సంజయ్, ఆర్మూర్ నుంచి ధర్మపురి అరవింద్ పోటీ చేయనున్నట్టు సమాచారం. మాజీ ఎంపీ విజయశాంతి ఏకంగా సీఎం కేసీఆర్పై పోటీచేయాలని ఆసక్తితో ఉన్నట్టు తెలిసింది.