Congress | చాలామంది కాంగ్రెస్ నాయకులు పోటీపడుతున్నప్పటికీ, రాజకీయాలతో ఏమాత్రం సంబంధంలేని 26 ఏండ్ల యువతి యశస్వినికి కాంగ్రెస్ పాలకుర్తి టికెట్ కేటాయించింది. అక్కడ పౌరసత్వం దరఖాస్తు తిరస్కరణతో ఎన్నారై ఝాన్సీరెడ్డి ఎన్నికల్లో పోటీకి అవకాశం లేకుండా పోయింది. అలాంటప్పుడు మిగతా నేతలెవరికైనా కాంగ్రెస్ టికెట్ ఇస్తుందేమోనని అందరూ అనుకున్నారు. కానీ పార్టీతో, రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని ఝాన్సీరెడ్డి మేనకోడలు యశస్వినికి కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. పాలకుర్తి టికెట్ను ఎంతకు అమ్ముకుంటే, మిగతావారెవరూ లేరన్నట్టుగా ‘అయితే అత్తకు.. లేదంటే కోడలికి..’ అన్నట్టుగా పీసీసీ వ్యవహరించగలుగుతుంది? ఓ కాంగ్రెస్ అసమ్మతి నేత మాట.
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): ఇప్పటివరకు విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలు రెండింటిని పరిశీలిస్తే కాంగ్రెస్ సాధారణంగా చెప్పే నీతిసూత్రాలు, నిబంధనవళిలాంటివి మచ్చుకైనా కనిపించవు. 40 ఏండ్ల అనుభవం ఉన్న సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డిలాంటి వ్యక్తికి నాగర్కర్నూల్ టికెట్ దొరకదు. రాత్రికి రాత్రే పార్టీ మారిన వ్యక్తికి కోరుకున్నచోట టికెట్ దొరుకుతుంది. పార్టీని నమ్ముకుని పనిచేసిన పాల్వాయి స్రవంతికి టికెట్ దొరకదు కానీ, మొన్నటి ఉపఎన్నికల ప్రత్యర్థి అయిన కోమటిరెడ్డికి కాంగ్రెస్లో చేరిన గంటల్లోనే టికెట్ వచ్చేస్తుంది. అందుకే పార్టీ జెండామోసినవారంతా ఇప్పుడు రగలిపోతున్నారు. పార్టీ కార్యక్రమాలనీ, జోడోయాత్ర అనీ ఇన్నాళ్లూ తమతో డబ్బులు ఖర్చు పెట్టించి తీరా ఇప్పుడు టికెట్లు మాత్రం పక్కపార్టీల నుంచి వచ్చినోళ్లకు కేటాయిస్తున్నారని మండిపడుతున్నారు. డబ్బున్నవాళ్లకు టికెట్లు అమ్ముకొంటున్నారని మొదటినుంచీ వినిపిస్తున్న ఆరోపణలు, ఇప్పుడు నిజమయ్యాయని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. టికెట్లు ఎంతకు అమ్ముకున్నారో చెప్పాలని నిలదీస్తున్నారు. ఒక అడుగు ముందుకేసి.. ‘ఇప్పుడే టికెట్లు అమ్ముకున్నోళ్లు, పొరపాటున అధికారంలోకి వస్తే రేపు రాష్ర్టాన్నీ అమ్మేయరా?’ అని ప్రశ్నిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే రెండో అభ్యర్థుల జాబితా విడుదలతో కాంగ్రెస్లో పెద్ద యుద్ధమే ప్రారంభమైంది. టికెట్లు రాని నేతలు రోడ్డెక్కి పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగరేస్తున్నారు. నాయకుల నిరసనలతో గాంధీభవన్ రణరంగమవుతున్నది. రెండోజాబితా మొత్తం కాసులున్నోళ్లతో, గులాంగిరీ చేసేటోళ్లతోనే నిండిపోయిందని.. అసలైన కాంగ్రెస్ నేతలకు ఇందులో స్థానమే దక్కలేదని అసంతృప్త నాయకులు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ సీట్ల కేటాయింపు అంతా పంచుకునుడు, అమ్ముకునుడు ఫార్ములాపైనే నడిచిందని వారు మండిపడుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, మాజీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి కలిసి సీట్లను కూడా వాటాల్లా పంచుకున్నారని వారు ఆరోపిస్తున్నారు. మహేశ్వరం సీటు కోసం రేవంత్రెడ్డి రూ.10 కోట్లు, 5 ఎకరాల భూమి రాయించుకున్నారని ఆ పార్టీ నేత కొత్త మనోహర్రెడ్డి విలేకరుల సమావేశం పెట్టి మరీ ఆరోపించారు. కాంగ్రెస్లో డబ్బుకే ప్రాధాన్యం ఉన్నదని, పార్టీ కోసం పనిచేసే వారికి గుర్తింపే లేదని మెదక్ డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి నిరసన స్వరం వినిపించారు. అమెరికా పర్యటనలో సీట్లు ఇప్పిస్తానని చెప్పి రేవంత్రెడ్డి సుమారు 36 మంది నుంచి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు వినిపించాయి.
తలా కొన్ని సీట్లు
నిన్నటివరకు కాంగ్రెస్ సీట్లను డబ్బులకు అమ్ముకున్నారనే విమర్శలు రాగా.. తాజాగా కొందరు ఏఐసీసీ, పీసీసీ నేతలు తలాకొన్ని సీట్ల చొప్పున పంచుకున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ముఖ్యంగా రేవంత్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వంటివారితోపాటు ఢిల్లీ నేతలు కొందరు ఎవరికి వారు తమ అనుచరులకు టికెట్లను పంచుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ రెండో జాబితాను పరిశీలిస్తే ఇదే స్పష్టమవుతుందని వారంటున్నారు. ఒక నియోజకవర్గంలో ఓ వ్యక్తిని రేవంత్రెడ్డి సపోర్ట్ చేస్తే.. మరో వ్యక్తిని ఉత్తమ్కుమార్రెడ్డి సపోర్ట్ చేసినట్లు వినిపిస్తున్నది. జనగామలో కొమ్మూరి ప్రతాప్రెడ్డిని రేవంత్ సపోర్ట్ చేయగా పొన్నాల లక్ష్యయ్యను ఉత్తమ్ సపోర్ట్ చేసినట్లు తెలిసింది. ఎల్లారెడ్డిలో మదన్మోహన్ను ఉత్తమ్ సపోర్ట్ చేయగా.. సుభాష్రెడ్డిని రేవంత్రెడ్డి సపోర్ట్ చేసినట్లు తెలిసింది. సూర్యాపేటలో దామోదర్రెడ్డిని ఉత్తమ్, పటేల్ రమేశ్రెడ్డిని రేవంత్రెడ్డి సపోర్ట్ చేస్తున్నట్లు తెలిసింది. నాగర్ కర్నూల్లో కూచుకుళ్ల రాజేశ్రెడ్డిని, కొల్లాపూర్లో జూపల్లిని, వనపర్తిలో మేఘారెడ్డిని, భువనగిరిలో కుంభం అనిల్ కుమార్రెడ్డిని, ఆదిలాబాద్లో కంది శ్రీనివాస్రెడ్డిని రేవంత్రెడ్డి సపోర్ట్ చేసినట్టు తెలిసింది. ఈ విధంగా చాలాచోట్ల ఎవరికి కావాల్సిన వారికి టికెట్లు ఇప్పించుకొని సీట్లను పంచేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సర్వే లేదు.. డిక్లరేషన్ లేదు
సర్వేల ప్రకారమే టికెట్లు ఇస్తామని, కొత్త నేతలకు ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ వరంగల్ సభలో ప్రగల్భాలు పలికారు. కానీ తీరా ఎన్నికలు వచ్చేసరికి మాట మార్చేశారు. సర్వేలతో సంబంధం లేకుండా టికెట్లను కేటాయించారు. ఉదయ్పూర్ డిక్లరేషన్ ప్రకా రం పార్టీలో కనీసం ఐదేండ్లు పనిచేసిన వారికే టికెట్ ఇవ్వాలి, ఒకే కుటుంబానికి ఒకే టికెట్ ఇవ్వాలి. కానీ తాను పెట్టుకున్న ఈ రెండు నిబంధనలనూ కాంగ్రెస్ నాయకత్వమే పాటించలేదు. ఉదయం పార్టీలో చేరినవారికీ సాయం త్రం టికెట్ ఇచ్చారు. అసలైన కాంగ్రెస్ నేతలను పక్కనబెట్టి, పారాచ్యూట్ నేతలకు పెద్దపీట వేశారు. రెండు జాబితాల్లో కలిపి మొత్తం 30మంది జంప్ జిలానీలకు కాంగ్రెస్ టికెట్లు కేటాయించడం గమనార్హం. ముఖ్యంగా రాజగోపాల్రెడ్డి వంటి నేత ఉదయం పార్టీలో చేరితో సాయంత్రం జాబితాలో ఆయన పేరు ఉండడంపై పార్టీలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తమ్, మైనంపల్లి లాంటివారి కు టుంబంలో రెండేసి టికెట్లు కేటాయించడమూ నాయకుల్లో అసమ్మతిని మరింత రాజేసింది.
ఖర్చు పెట్టించారు.. మొండిచెయ్యి చూపారు
‘రాహుల్ గాంధీ పాదయాత్రకు, సభలు, సమావేశాలకు ఖర్చు పెట్టుకోండి… ఎన్నికల్లో టికెట్ ఇప్పించే బాధ్యత నాది’ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తమను నమ్మించి మోసం చేశారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. రేవంత్రెడ్డి మాటలు నమ్మి కోట్లకు కోట్లు ఖర్చు చేస్తే తీరా… టికెట్ ఇవ్వకుండా మోసం చేశారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో నేతలు ఉన్నట్లు సమాచారం. వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ మహిళానేత రాహుల్గాంధీ యాత్రతోపాటు పలు సభలకు రూ. కోట్లలో ఖర్చు చేశారట. తీరా ఆమెకు తుది జాబితాలో సీటు దక్కకలేదు. మేడ్చల్ జిల్లాకు చెందిన మరో నేత కూడా రాహుల్ సభలకు భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేశారు. ఆయనకు కూడా సీటు దక్కలేదు. తీవ్ర అసంతృప్తితో ఇటీవలే పార్టీని వీడిన ఆ నేతతోపాటు మెదక్ జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత కూడా భారీగా డబ్బు ఖర్చు చేసి మోసపోయారు. ఇలా రేవంత్ ఇచ్చిన టికెట్ హామీతో పెద్దమొత్తంలో డబ్బులు ఖర్చు చేసినవారెందరో ఉన్నారు. వారంతా ఇప్పుడు టికెట్ దక్కకపోవడంతో లబోదిబోమంటున్నారు.