హైదరాబాద్/ఖమ్మం, డిసెంబర్ 15(నమస్తే తెలంగాణ): వచ్చే ఐదేండ్లలో రాష్ట్రంలో ఏడాదికో ఆయిల్పామ్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆయిల్పామ్ సాగు రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. శుక్రవారం సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన మూడు కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు. ఆయిల్ఫెడ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో రూ.1050 కోట్ల వ్యయంతో ఐదు ఆయిల్పామ్ పరిశ్రమలు నెలకొల్పేందుకు ఆమోదం తెలుపుతూ సంబంధిత ఫైలుపై తొలి సంతకం చేశారు. రూ. 4.07 కోట్ల ఖర్చుతో 110 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణకు సంబంధించిన ఫైలుపై రెండో సంతకం, సహకార వ్యవస్థ కంప్యూటరీకరణకు సంబంధించిన ఫైలుపై మూడో సంతకం చేశారు. అనంతరం గద్వాలకు చెందిన పట్టుపరిశ్రమశాఖ అధికారి జగన్నాథ్ కుమారుడు ఆశిష్ కుమార్కు కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పిస్తూ నియామకపత్రం అందజేశారు.
ఆయిల్పామ్తో స్థిరమైన ఆదాయం
బాధ్యతల స్వీకరణ అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ఆయిల్పామ్ సాగుకు రాష్ట్రంలో విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. రైతులు ఈ సాగువైపు దృష్టిసారించేలా అధికారులు దిశానిర్దేశం చేయాలని సూచించారు. దాదాపు 30 ఏండ్ల వరకు దిగుబడినిచ్చే దీర్ఘకాలిక పంటగా ఆయిల్పామ్ స్థిరమైన ఆదాయం ఇస్తుందని వివరించారు. సంప్రదాయ పంటలతో పోలిస్తే పామాయిల్ సాగుతో ఎకరాకు రూ. లక్ష వరకు ఆదాయం వస్తుందని తెలిపారు. ఇందులో అంతరపంటలు కూడా వేసుకోవచ్చని పేర్కొన్నారు. టీఎస్ ఆయిల్ ఫెడ్ ద్వారా 2023-24 సంవత్సరం నుంచి ప్రతిఏటా 40 వేల ఎకరాల విస్తీర్ణం పెంచేలా ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు ఇతర అధికారులు, మంత్రి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి తుమ్మలకు శుభాకాంక్షలు తెలిపారు.