పెద్దపల్లి, జనవరి 20 (నమస్తే తెలంగాణ): బీజేపీ ఏడున్నరేండ్ల పాలనలో దేశంలోని దళిత బహుజనుల కోసం ఒక్క నిర్మాణాత్మక కార్యక్రమం కూడా చేపట్టలేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. బీజేపీ చరిత్రంతా విద్రోహం, విధ్వంసమేనని మండిపడ్డారు. తెలంగాణలోని ఎస్సీ నియోజకవర్గాల్లో బీజేపీ జెండా ఎగరేస్తామని చెప్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే దళితబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయించాలని డిమాండ్చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శాసనమండలి విప్ భానుప్రసాదరావు, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డితో కలిసి గురువారం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని ఎస్సీ రిజర్వ్ స్థానాలకు బీజేపీ ఇన్చార్జిలుగా జితేందర్రెడ్డి, ప్రేమేందర్రెడ్డిని పెట్టడమంటేనే దళితులను అవమానించడమని అన్నారు. ‘బీజేపీ గతంలో ఎప్పుడైనా ఎస్సీల సంక్షేమం గురించి మాట్లాడిందా? అసలు బీజేపీ సిద్ధాంతమే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు వ్యతిరేకం. ఇది ఎన్నో సందర్భాల్లో బయటపడింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన ఎస్సీ, ఎస్టీలపై కేసులు విపరీతంగా పెరిగాయి. 2019లో ఎస్సీలపై 45,961, ఎస్టీలపై 8,272 కేసులు నమోదు అయ్యాయి. బీజేపీ అధికారంలో ఉన్న యూపీలో అత్యధికంగా 12,714 కేసులు, మధ్యప్రదేశ్లో 5 వేలు, గుజరాత్లో 15 వేల కేసులు నమోదయ్యాయి. బీజేపీ పాలనలో ఎస్టీ, ఎస్సీలపై జరుగుతున్న ఘోరాలకు ఇవే ఉదాహరణ’ అని విమర్శించారు.
బీజేపీ చరిత్ర వారి హింసాపూరిత సిద్ధాంతాన్ని బయటపెడుతున్నదని మంత్రి కొప్పుల విమర్శించారు. 2014లో యూపీలో దళిత బాలికను అత్యాచారం చేసి దారుణంగా చంపిన ఘటన, 2021 అక్టోబర్లో అఖిల్సింగ్ను పాశవికంగా హత్యచేసిన ఘటనలే ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. నరేంద్రమోదీ, గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో జరిగిన గోద్రా అనంతర ఊచకోతలో ఎస్సీ, బీసీ, మైనారిటీలను బలితీసుకున్నారని ఆరోపించారు. ఇప్పటికీ 250 మంది ఆచూకీ లభించలేదని తెలిపారు. ఇంత కుట్ర పూరితమైన బీజేపీ నాయకులు దళిత, గిరిజనుల అభివృద్ధి గురించి మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు.