మాక్లూర్, ఏప్రిల్ 13: సరదాగా చెరువులోకి స్నానానికి వెళ్లిన ముగ్గురు నీట మునిగి ప్రాణాలు కోల్పోగా, మరొకరు త్రుటిలో తప్పించుకున్నారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం ఒడ్యాట్పల్లి గ్రామంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నీరుగొండ నరేశ్ (19), చిత్తారి మహేశ్ (19), వెంకటేశ్ అలియాస్ తిరుపతి (15), వినోద్, సాయితేజ నివాసాలు పక్కనే ఉంటాయి. ఒకే సామాజిక వర్గానికి చెందిన వీరంతా శనివారం మధ్యాహ్నం 3 గంటల వరకు సాయితేజ ఇంటి వద్ద షటిల్ ఆడారు.
ఆ తరువాత గ్రామ శివారులోని ధర్మాడి చెరువులో స్నానానికి వెళ్లారు. సాయితేజ, మరో మిత్రుడు నివేశ్ కాస్త ఆలస్యంగా వెళ్లగా, అప్పటికే మిగతా నలుగురు చెరువులోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో నీటిలో మునిగి పోతూ కేకలు వేశారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న సాయితేజ, నివేశ్ వినోద్ను బయటకు లాగారు. కానీ మిగతా ముగ్గురు నరేశ్, మహేశ్, తిరుపతి గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు హుటాహుటిన వచ్చి చెరువులోకి దిగి గాలించగా ముగ్గురి మృతదేహాలు లభించాయి.