Rakhi Pournami | ముస్తాబాద్/నర్సాపూర్/నేరడిగొండ, ఆగస్టు 31: రాఖీ పండుగను సంతోషంగా జరుపుకోవాలనుకున్న వారి ఇండ్లల్లో తీవ్ర విషాదం నిండింది. తోబుట్టువులకు రాఖీలు కట్టి పేగుబంధాన్ని చాటుకోవాలనుకున్న ఆ ఆడబిడ్డలకు చేదు అనుభవం ఎదురైంది. వేర్వేరు చోట్ల ముగ్గురు మృతి చెందడంతో.. కుటుంబసభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. చివరికి మృతదేహాలకు రాఖీలు కట్టి కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ హృదయవిదారక ఘటనలు గురువారం పలు జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన అనవేని నర్సింలు (38)కు రాఖీ కట్టేందుకు అక్క రాజవ్వ గంభీరావుపేట మండలం నర్మాల గ్రామం నుంచి బుధవారం తమ్ముడి ఇంటికి వచ్చింది. గురువారం రాఖీ కట్టి పండుగను సంతోషంగా జరుపుకోవాలనుకున్నది. అయి తే.. బుధవారం రాత్రి పొలం వద్దకు వెళ్ళిన నర్సింలు గురువారం ఉదయం వరకు ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్ళి చూసేసరికి బావిలో కరెన్సీ నోట్లు నీటిపై తేలియాడుతున్నాయి.
అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహకారంతో బావిలో నీటిని మోటర్ల సాయంతో తొలగించగా నర్సింలు మృతదేహం బయటపడింది. మృతదేహాన్ని చూసి భార్యా బిడ్డలు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. రాఖీ కట్టేందుకు వచ్చిన అక్క రాజవ్వ ‘రాఖీ ఎవరికి కట్టాలె తమ్మి.. దేవుడెంత పనిజేసె తమ్మి’ అంటూ తమ్ముడి మృతదేహంపై పడి విలపించింది. చివరిసారిగా అక్కడే రాఖీ కట్టి రోదించిన తీరు స్థానికులను కంటతడిపెట్టించింది. మృతుడికి భార్య మంగ, కూతురు హారిక, కొడుకు రేవంత్ ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని ఆవంచ గ్రామానికి చెందిన కొండి జగన్(45) కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో అస్వస్థతకు గురై మృతిచెందాడు. జగన్కు ఇద్దరు చెల్లెళ్లు నరసమ్మ, అంబిక ఉన్నారు. అన్నకు రాఖీ కట్టేందుకు సంతోషంగా పుట్టింటికి వచ్చిన చెల్ల్లెళ్లకు విషాదం ఎదురయ్యింది. రాఖీ కడదామని వస్తే ‘మాకుదిక్కు లేకుండా పోయావా అన్నా’ అంటూ మృతదేహంపై పడి చెల్లెళ్లు రోదిస్తుంటే.. అక్కడున్నవారందరూ కంటతడిపెట్టారు.
రాఖీ పండుగ కోసం తన భర్తతో కలిసి స్వగ్రామానికి వచ్చిన ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం కన్గుట్ట గ్రామానికి చెందిన నల్ల లింగయ్య భార్య నర్సవ్వ(38)తో కలిసి రాఖీ పండుగ కోసం బుధవారం కన్గుట్టకు వచ్చాడు. గురువారం పండుగ ముగించుకొని తాను పనిచేస్తున్న నిర్మల్ జిల్లా మంజులాపూర్కు భార్య నర్సవ్వ, తమ్ముడు కల్యాణ్తో కలిసి బైక్పై వెళ్తున్నాడు. నేరడిగొండలోని నీలిమా దాబా వద్ద వేగంగా వచ్చిన కారు వీరి బైక్ను ఢీకొనడంతో నర్సవ్వ అక్కడిక్కడే మృతి చెందింది. లింగయ్య, కళ్యాణ్కు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు అంబులెన్స్లో నిర్మల్ ఏరియా దవాఖానకు తరలించారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు ఎస్సై సాయన్న తెలిపారు.