కార్వాన్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): కొత్తగా నిర్మిస్తున్న డ్రైనేజే పైప్లైన్లోకి పనుల నిమిత్తం దిగిన ముగ్గురు కూలీలు విషవాయువుల బారిన పడి మృత్యువాత పడ్డారు. మూడు కుటుంబాలలో విషాదాన్ని నింపిన ఘటన హైదరాబాద్ కుల్సుంపురా పోలీస్స్టేషన్ పరిధిలోచోటుచేసుకొన్నది. వివరాల్లోకెళ్తే.. నారాయణఖేడ్కు చెందిన హన్మంత్(40), వనపర్తి జిల్లా తిప్పడం గ్రామానికి చెందిన శ్రీను(40) కార్వాన్లో నివాసముంటున్నారు. రాములు (50) చంపాపేట్లో ఉంటున్నాడు. ఈ ముగ్గురు జియగూడలో పైపులైన్ల పనుల నేపథ్యంలో సదరు కాంట్రాక్టర్ వద్ద రోజు వారీ కూలీలుగా పనిచేస్తున్నారు. పురానాపూల్ నుంచి జియగూడకు వెళ్లే 100 ఫీట్ల రోడ్డుకు అనుకొని నూతనంగా భారీ పరిమాణంతో సీవరేజ్ పైపులైన్ల నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో జియాగూడ హనుమాన్ ఆలయం సమీపంలో మ్యాన్హోల్ దగ్గర పైపులైన్ వద్ద పాత కనెక్షన్ మూసివేస్తున్న రాములు విషవాయువులు పీల్చుకొని అపస్మారక స్థితిలోకి చేరుకొన్నాడు. దీనిని గమనించి వెంటనే హన్మంతు, శ్రీనులు అతనిని బయటకు తీసేందుకు లోనికి దిగారు. ఆ ఇద్దరు కూడా అందులోనే చిక్కుకుపోయారు. హన్మంత్, శ్రీను విషవాయువుల ధాటికి అపస్మారక స్థితిలోకి చేరి తుదిశ్వాస విడిచారు. రాములు ఉస్మానియా దవాఖానలో చికిత్స పొందుతూ మరణించాడు. మృతుల బంధువులు స్థానిక పోలీస్స్టేషన్కు చేరుకొని, తమకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. జలమండలి అధికారులు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంపై కారణంగానే కూలీలు మృతిచెందారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.