పెద్దపల్లి: సింగరేణి (Singareni)బొగ్గు గనిలో తీవ్ర విషాదం నెలకొన్నది. పెద్దపల్లి జిల్లా రామగుండం డివిజన్లోని అడ్రియాల బొగ్గు గని ప్రమాదంలో చిక్కుకున్న ముగ్గురు మృతిచెందారు. శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురి మృతదేహాలను రెస్క్యూ టీం వెలికితీసింది. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో డిప్యూటీ మేనేజర్ తేజావత్ చైతన్య మృతదేహాన్ని సహాయక సిబ్బంది బయటకు తీసుకువచ్చారు. బుధవారం ఉదయం ఏరియా సేఫ్టీ ఆఫీసర్ ఎస్ జయరాజు, కాంట్రాక్ట్ కార్మికుడు తోట శ్రీకాంత్ మృతదేహాలను వెలికితీశారు. వారి మృతదేహాలను సింగరేణి దవాఖానకు తరలించారు.
అడ్రియాల్ గనిలో సోమవారం ఉదయం 11 గంటల సమయంలో 86వ లెవల్ వద్ద హఠాత్తుగా పైకప్పు కూలపోయింది. దీంతో ఇద్దరు ఉద్యోగులు, ఏడుగురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన సింగరేణి రెస్క్యూ బృందం రాత్రి వరకు ముగ్గురిని ప్రాణాలతో కాపాడగా, నలుగురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. మంగళవారం మధ్యాహ్నం కార్మి కుడు వీరవేన రవీందర్ను క్షేమంగా బయటికి తీసుకొచ్చారు.