TS Weather | తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలను దాటేశాయి. పలు మండలాల్లో తీవ్ర వడగాలులు కూడా వీస్తున్నాయి. ఇదిలా ఉంటే రాగల మూడు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరో 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురు, శుక్రవారాల్లో పలు జిల్లాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది. గురువారం కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని పేర్కొంది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ మూడు రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా, మన్నార్ గల్ఫ్ నుంచి అంతర్గత తమిళనాడు, రాయలసీమ మీదుగా దక్షిణ తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ద్రోణి ప్రభావంతో బుధ, గురు, శుక్రవారాల్లో పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.