Heavy Rains Alert | తెలంగాణలో రాగల మూడురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని.. ప్రస్తుతం మహబూబ్నగర్, కావలి వరకు విస్తరించాయని.. తెలంగాణ, ఏపీలోని మిగతా ప్రాంతాల్లో విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఒడిశా తీరం వెంబడి వాయువ్య బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడిందని వాతావరణశాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి దక్షిణం వైపునకు వంగి ఉందని పేర్కొంది.
నెమ్మదిగా ఉత్తరం వైపునకు కదిలే అవకాశాలున్నాయని.. రాబోయే 48గంటల్లో మరింత బలపడే అవకాశముందని పేర్కొంది. తూర్పు విదర్భపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని.. ఇప్పుడు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిందని పేర్కొంది. ఈ క్రమంలో రాబోయే మూడురోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఐదు నుంచి ఏడు డిగ్రీల వరకు తక్కువగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గురువారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. నాలుగు జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అలాగే, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ కేంద్రం.