Karimnagar | కరీంనగర్ : కరీంనగర్ మాతా శిశు సంరక్షణ కేంద్రంలో శిశువు మాయమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేట్కు చెందిన నిర్మల అనే గర్భిణికి నెలలు నిండడంతో మూడు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరింది. ఆదివారం ఉదయం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. నిర్మల భర్త మనోజ్ రామ్.. పసిబిడ్డ వద్ద బంధువును ఉంచి బయటకు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి పసిపాప అదృశ్యమైంది. దీంతో నిర్మల దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఓ మహిళ పసిబిడ్డను ఎత్తుకెళ్లిన దృశ్యాలు ఆస్పత్రి ముందున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఆ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బీహార్కు చెందిన మనోజ్ రామ్, నిర్మల బతుకుదెరువు కోసం బావుపేటకు కొన్నేండ్ల క్రితం వచ్చారు. బావుపేట వద్ద గ్రానైట్ క్వారీస్లో రామ్ దంపతులు కూలీలుగా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇక పసిబిడ్డ అదృశ్యం కావడంతో వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.