హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రలోభాలకు గురి చేసిన కేసులో ముగ్గురిని ఎస్ఓటీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో నందకుమార్, సింహయాజులు, రామచంద్ర భారతి ఉన్నారు. షేక్పేటలోని హిల్టాప్ అపార్ట్మెంట్లో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ముగ్గురిని సైబరాబాద్ సీపీ కార్యాలయానికి తరలించారు. అనంతరం వారిని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నది.
ఇదిలా ఉండగా.. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు ధర్మాసనాలు రెండు వేర్వేరు తీర్పులను వెలువరించాయి. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి బీజేపీలో చేరితే రూ.కోట్ల నగదు ఇస్తామంటూ ప్రలోభపెట్టడంపై నమోదైన కేసు దర్యాప్తును సిట్ లేదా సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ బీజేపీ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. నవంబర్ 4 వరకు దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించింది. అలాగే సైబరాబాద్ పోలీసులు వేసిన మరో పిటిషన్లో.. ముగ్గురు నిందితులను రిమాండ్కు అనుమతిస్తూ మరో ధర్మాసనం తీర్పును వెలువరించింది.