Srishailam | శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు త్రయోదశి ప్రత్యేక పూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించినట్లు ఈవో లవన్న( EO Lavanna ) తెలిపారు. లోకకళ్యాణాన్ని కాంక్షిస్తూ ప్రదోషకాల సమయంలో నందిమండపంలోని శనగల బసవన్నకు పంచామృతాభిషేకాలు జరిపించి నానబెట్టిన శనగలు నైవేద్యంగా సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శనాలు కల్పించి తీర్థప్రసాదాలు ఇచ్చారు.
వివిధ ప్రాంతాల నుండి క్షేత్రానికి వస్తున్న వారు ముందస్తుగా ఆన్లైన్లో వసతి గదులు, ఆర్జిత సేవా టిక్కెట్లు కేటాయింపు చేసుకుని ఆలయ సిబ్బందికి సహకరించాలని ఈవో కోరారు. భక్తుల రద్దీకి అనుగుణంగా దేవస్థానం అన్ని ఏర్పాట్లను చేసి స్వామి అమ్మవార్ల దర్శనాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఉభయ దేవాలయాలతో పాటు హఠకేశ్వరం, పాలధార పంచధార, సాక్షి గణపతి, శిఖరేశ్వర ఆలయాలు భక్తులతో సందడిగా కనిపించాయి.
ఉగాది మహోత్సవాల సందర్భంగా కన్నడిగులు శ్రీశైలానికి వచ్చి స్వామిఅమ్మవార్ల దర్శనానంతరం సిద్దరామేశ్వర కొలను కూడా దర్శించుకుంటారని ఈవో లవన్న చెప్పారు. అందువల్ల యాత్రికులు ఇబ్బందులు పడకుండా ధృడమైన బారికేడ్లను ఏర్పాటు చేసి భక్తులు వచ్చి వెళ్లేందుకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈఈ రామకృష్ణ, డీఈ నర్సింహారెడ్డిలు బారికేడ్ పనులు వేగవంతం చెసేలా చర్యలు తీసుకుంటున్నారు.