హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 9 (నమస్తే తెలంగాణ): చేప ప్రసాదం పంపిణీ తెలంగాణకే తలమానికం అని పశు సంవర్ధక, ఫిషరీస్శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ చెప్పారు. మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో శుక్రవారం బత్తిని కుటుంబీకుల చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి, మాట్లాడారు. బత్తిని హరినాథ్గౌడ్ కుటుంబసభ్యులు ఇచ్చే చేప ప్రసాదంపై ప్రజలకు ఎంతో నమ్మకమని చెప్పారు.
చేప ప్రసాదాన్ని బత్తిని కుటుంబీకులే అందిస్తున్నప్పటికీ.. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఖర్చుకు వెనుకాడకుండా ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి భోజన సౌకర్యాలు సమకూర్చిన స్వచ్చంద సంస్థలను అభినందించారు. చేప ప్రసాదం పంపిణీ శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి వరకు కొనసాగింది. మొత్తం 80 వేల మందికి చేప ప్రసాదాన్ని పంపిణీ చేశారు.