హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): జనవరి ఆరో తేదీ నుంచి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ చేపట్టనున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, తప్పొప్పుల సవరణ, చిరునామాల మార్పు తదితర అంశాలకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు పేర్కొన్నది. 2024, జనవరి 1వ తేదీలోగా 18 ఏండ్లు నిండినవారు ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంటూ శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. జనవరి 6న ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రచురించి అదే రోజు నుంచి 22 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. వాటిని ఫిబ్రవరి రెండో తేదీ వరకు పరిష్కరిస్తారు.
ఫిబ్రవరి 6లోగా డాటాబేస్లో అప్డేట్ చేసిన తర్వాత 8న తుది జాబితా ప్రచురిస్తారు. అక్టోబర్ 1లోగా 18 ఏండ్లు నిండుతున్నవారూ ముందస్తుగా పేరు నమోదుకు అవకాశం కల్పించారు. వీరి దరఖాస్తుల పరిశీలన అక్టోబర్ 1 తర్వాత నిర్వహిస్తారు. జనవరి 5 వరకు పోలింగ్ స్టేషన్ల రీ అరేంజ్మెంట్, ఓటర్ల జాబితా, గుర్తింపు కార్డుల్లోని లోపాల సవరణ, పోలింగ్ కేంద్రాల సరిహద్దుల సవరణ ప్రక్రియను పూర్తి చేయనున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.