హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : కరెంట్పై కార్పొరేట్ల కన్నుపడిందని, టెలికం రంగం తరహాలోనే కరెంట్ను కైవసం చేసుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. విద్యుత్తు సవరణ బిల్లు వెనుక కార్పొరేట్ శక్తులు ఉన్నాయని తెలిపారు. భవిష్యత్తు అంతా విద్యుత్తు రంగానిదేనని.. త్వరలోనే కరెంట్ కార్లు, బస్సులు రాబోతున్నాయని గమనించే కార్పొరేట్శక్తులు ఈ రంగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన చెప్పారు.
ఈ కుట్రలను విద్యుత్తు ఉద్యోగులు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యుత్తు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ (టీఎస్పీఈ) జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం ఖైరతాబాద్లోని విద్యుత్తు సౌధలో మహాధర్నా నిర్వహించారు. విధులను బహిష్కరించిన ఉద్యోగులు, నల్లచొక్కాలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆందోళనకు మద్దతుగా మాట్లాడిన వినోద్కుమార్.. ఈ బిల్లుతో రైతులు, సామాన్యులకు ప్రమాదం పొంచి ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ర్టాలను సంప్రదించకుండా ప్రధాని మోదీ నియంతగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఈ బిల్లును టీఆర్ఎస్ పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, విద్యుత్తు ఉద్యోగుల పోరాటానికి అండగా ఉంటామని ఆయన స్పష్టంచేశారు. విద్యుత్తు బిల్లులో కేంద్రం చేర్చిన ‘యాజ్ ప్రిస్ర్కైబ్డ్’ అనే పదం పర్యవసనాలు దారుణంగా ఉంటాయని వినోద్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ పదం చేర్చడం ద్వారా ఎలా కావాలంటే అలా.. ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్టాలను మార్చుకునే వీలుంటుందని ఇది పూర్తిగా అభ్యంతరకరమని ఆయన వివరించారు.
ఈ పదంతో ఉద్యోగుల నెత్తిమీద కత్తివేలాడబోతున్నదని.. జీతాలు ఎక్కువగా ఉన్నాయంటూ ఉద్యోగులు, ఇంజినీర్లు, సూపర్వైజర్లు, ఆర్టిజన్లను తొలగించే ప్రమాదం పొంచి ఉన్నదని తెలిపారు. చర్చలేకుండానే బిల్లులను ఆమోదిస్తున్న తరుణంలో విద్యుత్తు సవరణ బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపడమంటే మోదీ ప్రభుత్వం సగం దిగినట్లని, ఉద్యోగుల నిరసనలు, ఆందోళనల వల్లే మోదీ ప్రభుత్వం జంకిందని వినోద్కుమార్ అభిప్రాయపడ్డారు. మహాధర్నాకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మద్దతు తెలిపారు. విద్యుత్తు బిల్లుకు ఆమోదం లభిస్తే సామాన్యులకు సబ్సిడీలు లభించవని, ఉచిత విద్యుత్తు దొరకదని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.
రాష్ట్రవ్యాప్తంగా హోరెత్తిన నిరసనలు..
విద్యుత్తు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ టీఎస్పీఈ జేఏసీ, టీఈఈ జేఏసీ, విద్యుత్తు అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో విద్యుత్తు ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. విధులను బహిష్కరించిన ఉద్యోగులు, కార్మికులు రాష్ట్రంలోని అన్ని విద్యుత్తు ఉత్పాదక కేంద్రాలు, డిస్కంలు, సర్కిల్, డివిజినల్ కార్యాలయాల ఎదుట ధర్నాలను నిర్వహించారు. టీఈఈ జేఏసీ ఆధ్వర్యంలో మింట్ కాంపౌండ్లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట బిల్లు ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. జేఏసీ చైర్మన్ కోడూరి ప్రకాశ్, కన్వీనర్ శివాజీ తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్తు అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పాపకంటి అంజయ్య ఆధ్వర్యంలో ఉద్యోగులు మింట్ కాంపౌండ్లో నిరసన ప్రదర్శనను నిర్వహించారు. షరీఫ్, అనురాధ, వెంకటేశ్వర్లు, మహేందర్రెడ్డి తదితరులు నిరసనలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు ఉద్యోగుల ఫోరమ్ ఆధ్వర్యంలోను ఇంజినీర్లు, ఉద్యోగులు విధులు బహిష్కరించి విద్యుత్తు సౌధలో నిరసనకు దిగారు. ఫోరమ్ నాయకులు మల్లేశం, శ్రీనివాస్, సురేశ్బాబు, సంజీవ్, శివకృష్ణ, ప్రసాద్, కృష్ణ, అశోక్, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. హనుమకొండ నక్కలగుట్టలోని విద్యుత్తుభవన్ వద్ద ఉద్యోగులు మహా ధర్నా నిర్వహించారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా అంతటా కరెంటు ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఎస్ఈ కార్యాలయంలో మహాధర్నా చేపట్టారు. దామరచర్ల మండలంలో నిర్మాణంలో ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో ట్రాన్స్కో, జెన్కో ఉద్యోగులు విధులు బహిష్కరించారు. నాగార్జునసాగర్లోని జెన్కో సీఈ కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్0, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్) ఎదుట కార్మికులు, ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసనకు దిగారు. అన్ని జిల్లాల్లోనూ అత్యవసర విభాగాలు మినహా విద్యుత్తు సిబ్బంది అందరూ ఆందోళనకు దిగారు.
క్విట్ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ ఉద్యమం..
విద్యుత్తు సవరణ బిల్లును ఉపసంహరించే వరకు.. క్విట్ ఇండియా ఉద్యమం తరహాలో క్విట్ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ ఉద్యమాన్ని చేపడుతామని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ కన్వీనర్, జాతీయ విద్యుత్తు ఇంజినీర్లు, ఉద్యోగులు సమన్వయ కమిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీ రత్నాకర్రావు ప్రకటించారు. అవసరమైతే నిరవధిక సమ్మెకు సైతం సిద్ధమని ప్రకటించారు. పలు సంఘాల నేతలు సదానందం, సాయిబాబు, శ్రీధర్, బీసీరెడ్డి, అనిల్కుమార్, శ్యాంమనోహర్, ఎం వెంకన్నగౌడ్, సుధాకర్రెడ్డి, తులసీనాగరాణి, ఎం నెహ్రూ, జీ నాగరాజు, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
ఆందోళన విరమించండి: సీఎండీ ప్రభాకర్రావు
విద్యుత్తు చట్ట సవరణ బిల్లును కేంద్రం స్టాండింగ్ కమిటీని సిఫారసు చేసిన నేపథ్యంలో ఉద్యోగులు ఆందోళనను విరమించాలని టీఎస్ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవుపల్లి ప్రభాకర్రావు విజ్ఞప్తిచేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లును సీఎం కేసీఆర్ నిశితంగా పరిశీలిస్తున్నారని.. ఉద్యోగులంతా ఆందోళనలు విరమించి విధుల్లో చేరాలని కోరారు. ఉద్యోగులు అద్భుతంగా పనిచేస్తున్నారంటూ సోమవారం భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్ కితాబిచ్చిన విషయాన్ని సీఎండీ గుర్తుచేశారు.