హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ప్రాజెక్టు కింద వచ్చే విద్యాసంవత్సరంలో రూ.1,786 కోట్లు ఖర్చు చేయనున్నారు. బుధవారం జరిగిన ఎస్ఎస్ఏ ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు (పీఏబీ) సమావేశంలో కేంద్ర విద్యా శాఖ అధికారులు ఆమోదం తెలిపారు. గత ఏడాది ఆమోదించిన మొత్తం (రూ.1,467 కోట్లు) కంటే ఇది రూ.319 కోట్లు అధికం. ఈసారి ఎస్ఎస్ఏ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం రూ.1,071 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.715 కోట్లు భరించనున్నాయి.
వర్చువల్గా నిర్వహించిన ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి, ఏఎస్పీడీ రమేశ్ హాజరయ్యారు. ఈసారి దాదాపు రూ. 30 కోట్లతో 32వేలమంది టీచర్లకు ట్యాబ్లు అందజేయాలని నిర్ణయించారు. వచ్చే విద్యాసంవత్సరం లో కొత్తగా 20కొత్త కేజీబీవీల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. 27 కేజీబీవీలను ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేశారు. వీటిలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభిస్తారు. మరో 42 కేజీబీవీలలో ఒకేషనల్ విద్యను ప్రారంభించేందుకు పీఏబీ సమావేశంలో ఆమోదం తెలిపారు.