ఖైరతాబాద్, మార్చి 29: దేశంలో ప్రతిపక్షాలన్నీ బలహీనంగా ఉన్నాయని, ఇదే ప్రధాని నరేంద్రమోదీకి బలంగా మారిందని సీనియర్ జర్నలిస్టు, సీ-ఓటర్స్ రిసెర్చ్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుతాను గురు అన్నారు. ‘ఇండియా టు భారత్’ పేరుతో 90 రోజులపాటు చేస్తున్న దేశ యాత్రలో భాగంగా ఆయన శుక్రవారం హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ సంరద్భంగా నియో సైన్స్ హబ్, సైన్స్అండ్ టెక్నాలజీ మాసపత్రిక, స్మార్ట్ ల్యాబ్ టెక్ సంస్థలు సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన చర్చాగోష్టిలో ఆయన పాల్గొని.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజల మనోగతం తదితర అంశాలపై చర్చించారు. భారత తొలి ప్రధాని జవాహర్లాల్ నెహ్రూ నుంచి ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హయాం వరకు పరిపాలన ఒక శకంలా కొనసాగిందని, ఆ తర్వాత 2014 వరకు దేశాన్ని పాలించిన ప్రధానులు అంతగా ప్రభావాన్ని చూపలేకపోయారని పేర్కొన్నారు. మోదీ హయాంలో దేశం కొంత అభివృద్ధి చెందినప్పటికీ సామాన్య ప్రజల స్థితిగతులు ఏమాత్రం మారలేదని, ముఖ్యంగా నిరుద్యోగం, ఉపాధి అవకాశాలు కొరవడటం లాంటి సమస్యల వల్ల ఇప్పటికీ ఎన్నో కోట్ల మంది దుర్భర జీవనాన్ని సాగిస్తున్నారని తెలిపారు. ఎలక్టోరల్ బాండ్లను దేశంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు పొందాయని పేర్కొంటూ..
ఈ అంశం ఎన్నికల్లో పెద్దగా ప్రభావాన్ని చూపబోదని అభిప్రాయపడ్డారు. అవినీతికి ఏ పార్టీ అతీతం కాదన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వాలకంటే ఎంతో కొంత నయమనుకొని బీజేపీకే ఓట్లు వేస్తున్నారని అన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని, వారి సమస్యలను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో విపక్షాలు పూర్తిగా విఫలమయ్యాయని చెప్పారు. దక్షిణాది, ఉత్తరాది ఓటర్లకు అనేక వ్యత్యాసాలు ఉన్నాయని ఆయన పేర్కొంటూ.. పాలకులు తమ కనీస అవసరాలు తీర్చితే చాలని భావించే ఉత్తరాది ఓటర్ల కంటే దక్షిణాది ఓటర్లు భిన్నంగా ఆలోచించడంతోపాటు మాతృభాషలు, సంస్కృతి, సంప్రదాయాలకు ఎంతో విలువ ఇస్తారని వివరించారు. అందుకే దక్షిణాదిలో జాతీయ పార్టీలు పాగా వేయలేకపోతున్నాయని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు సైతం ఇక్కడ అంతగా ప్రభావం చూపలేకపోతున్నాయని అన్నారు. దేశంలోని సామన్య ప్రజల ఆలోచనలు, అభిప్రాయాలను తెలుసుకుని వారి ఆకాంక్షలను ఆర్థం చేసువాలన్న లక్ష్యంతోనే ‘ఇండియా టు భారత్’ యాత్రను చేపట్టినట్టు చెప్పారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు, రచయిత రాకా సుధాకర్, నియో సైన్స్ హబ్ మాసపత్రిక మేనిజింగ్ డైరెక్టర్, పబ్లిషర్ సత్యప్రసాద్ పీవీ, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సుబ్రహ్మణియన్ అయ్యర్ పాల్గొన్నారు.