హైదరాబాద్, ఆగస్టు 20(నమస్తే తెలంగాణ): వేలం వేసిన ధాన్యం బకాయిలను చెల్లించేందుకు మిల్లర్లకు చివరి అవకాశం ఇస్తున్నామని సివిల్ సప్లయ్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ 31 లోగా మూడు వాయిదాల్లో బకాయిలు చెల్లించాలని ఆదేశించారు. బకాయిలు చెల్లించని మిల్లర్లను డీఫాల్టర్గా ప్రకటించడంతోపాటు 25% జరిమానా, 12% వడ్డీతో వసూలు చేస్తామని హెచ్చరించారు. పీడీ యాక్ట్లు సైతం నమోదు చేస్తామని, భవిష్యత్తులో ప్రభుత్వం వారికి ధాన్యం ఇవ్వదని తేల్చిచెప్పారు. శాఖాపరంగా చేపట్టిన కఠిన చర్యల వల్ల ఇప్పటివరకు మొత్తం రూ.వెయ్యి కోట్ల బకాయిలు వసూలైనట్టు తెలిపారు.
ఈ మేరకు గురువారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక ‘మిషన్ కే-100’ విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకొన్నదని, వానకాలానికి (2026-27) ముందే పెండింగ్లో ఉన్న సీఎమ్మాఆర్ తరలింపు, గోదాముల ఖాళీ చేయడం, నిధుల సమీకరణలో కీలక విజయాలు సాధించినట్టు వెల్లడించారు. మిషన్ కే-100 ప్రారంభించిన 50 రోజుల్లో 11.17 లక్షల టన్నుల సీఎమ్మాఆర్ డెలివరీ సాధించినట్టు తెలిపారు. 340 మిల్లులు తిరిగి ప్రారంభమయ్యాయని, ఇప్పటివరకు గింజ డెలివరీ చేయని మిల్లుల సంఖ్య 1,011కి తగ్గిందని చెప్పారు.