Niranjan Reddy : కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం లక్ష్మిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ మండల నాయకుడు శ్రీధర్ రెడ్డి (45) దారుణ హత్యకు గురికావడంపట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. విదేశాలలో బంధువుల పెళ్లికి వెళ్లిన ఆయన శ్రీధర్రెడ్డి హత్యపై స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.
గత 5 నెలల కాలంలో ఇద్దరు బీఆర్ఎస్ నాయకులు హత్యకు గురికావడం దురదృష్టకరమని నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాజకీయంగా చెదురుమొదురు సంఘటనలు తప్ప, ఒక్క హింసాత్మక చర్యగానీ, హత్యలుకానీ జరగలేదని గుర్తుచేశారు. తాము సోదరభావంతో అందరినీ కలుపుకొని ప్రజాస్వామ్యయుతంగా పాలన చేశామని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ ద్వేషాలను వ్యక్తిగత ద్వేషాలుగా తీసుకొని హత్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. గంట్రావ్ పల్లెలో మల్లేష్ యాదవ్ను, గత రాత్రి లక్ష్మిపల్లిలో శ్రీధర్ రెడ్డిని దారుణంగా గొడ్డలతో నరికి చంపారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంలో హత్యలకు తావు లేదని వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, ఆత్మస్థైర్యం కొల్పోవద్దని నిరంజన్ రెడ్డి సూచించారు. తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. శ్రీధర్ రెడ్డి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తాను జిల్లా ఎస్పీతో మాట్లాడానని, హత్య చేసిన వారిని, హత్యకు ప్రోత్సహించిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరానని ఆయన తెలిపారు.