హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): దేశ ఔషధ రాజధానిగా భాసిల్లుతున్న హైదరాబాద్ సిగలో మరో ప్రఖ్యాత సంస్థ కొలువుదీరనున్నది. వ్యాక్సిన్ల తయారీలో ప్రపంచ దిగ్గజ సంస్థగా ఖ్యాతి పొందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) హైదరాబాద్లో ఎక్సలెన్స్ సెంటర్ను ప్రారంభించనున్నది. ‘డాక్టర్ సైరస్ పూనావాలా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అండ్ పాండమిక్ ప్రిపేర్డ్నెస్’ పేరుతో దీన్ని నెలకొల్పనున్నట్టు ఎస్ఐఐ సీఈవో అధర్ పూనావాలా ఆదివారం ప్రకటించారు. హైదరాబాద్లో ఈ వారం ‘బయో ఏషియా’ సదస్సు జరుగనున్న నేపథ్యంలో ఎస్ఐఐ నుంచి ఈ ప్రకటన రావడం విశేషం.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ దావోస్లో జరిపిన పర్యటనతో వచ్చిన మరో ఫలితం ఇది. ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్)లో పాల్గొనేందుకు నిరుడు మే నెలలో దావోస్కు వెళ్లిన మంత్రి కేటీఆర్ అక్కడ అధర్ పూనావాలాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ప్రాథమికంగా అంగీకరించిన పూనావాలాతో మంత్రి కేటీఆర్ ఆదివారం మరోసారి ఆన్లైన్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ చర్చల అనంతరం హైదరాబాద్లోని ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్’లో ఎక్సలెన్స్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్టు పూనావాలా ప్రకటించడంతో మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాక్సిన్ తయారీ కేంద్రమైన హైదరాబాద్కు ఎస్ఎస్ఐని సాదరంగా ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. ప్రజారోగ్య సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి సీరం ఎక్సలెన్స్ సెంటర్ అదనపు శక్తిని అందించగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ప్రభుత్వం, ఎస్ఐఐ సంయుక్తంగా పనిచేసి నిపుణులను, వనరులను ఒకే చోటికి చేర్చగలిగితే ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా సమర్థంగా అధిగమించేందుకు వీలువుతుందని చెప్పారు. అధర్ పూనావాలా మాట్లాడుతూ.. తమ ఎక్సలెన్స్ సెంటర్ బహుళ ప్రయోజనాత్మకంగా ఉంటుందని, ప్రజారోగ్యాన్ని మెరుగుపరుచడంతోపాటు ఇన్ఫెక్షన్లు, మహమ్మారులపై నిరంతరం నిఘా ఉంచుతుందని పేర్కొన్నారు. ఎలాంటి విపత్తులనైనా ఎదుర్కొనేలా స్థానిక వైద్యసిబ్బందిని సిద్ధం చేస్తుందని చెప్పారు. తెలంగాణలో ఏవైనా మహమ్మారులు విజృంభిస్తే వ్యక్తిగతంగా, కుటుంబాలవారీగా బాధితుల సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి అందిస్తుందని, తద్వారా వారి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు సహకరిస్తుందని వివరించారు. కార్యక్రమంలో ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, లైఫ్సైన్సెస్ విభాగం డైరెక్టర్ శక్తి ఎం నాగప్పన్, ఐఐపీహెచ్ ప్రొఫెసర్ శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా కొనసాగుతున్న ఎస్ఎస్ఐ కంపెనీ ఏటా 150 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేసి, 170 దేశాలకు ఎగుమతి చేస్తున్నది. హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్న ఎస్ఐఐ ఎక్సలెన్స్ సెంటర్లో సుదీర్ఘ అనుభవమున్న ఆరోగ్య నిపుణులను నియమించి, అత్యాధునిక టెక్నాలజీతో పనిచేసేలా తీర్చిదిద్దనున్నారు. భవిష్యత్తులో కొవిడ్ లాంటి విపత్తులు, మహమ్మారుల విజృంభించినప్పుడు ఈ సెంటర్ సమాచార, పరిశోధన కేంద్రంగా సహాయపడటంతోపాటు ప్రజా సేవలను మరింత మెరుగుపరిచే అధ్యయన కేంద్రంగా పనిచేస్తుందని ఎస్ఐఐ తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య పరిస్థితులపై నిరంతరం ఓ కన్నేసి ఉంచుతుందని, ఎక్కడ ఎలాంటి విపత్తులు సంభవించినా వెంటనే గుర్తించి సమాచారాన్ని అందిస్తుందని, బాధితులకు అవసరమైన సహాయం అందిస్తుందని పేర్కొన్నది. ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచేందుకు పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (పీహెచ్ఎఫ్ఐ) దేశవ్యాప్తంగా 5 ఐఐపీహెచ్లను ఏర్పాటు చేసింది. వాటిలో హైదరాబాద్ ఒకటి.