వనపర్తి : వ్యవసాయానికి వన్నెతెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. 70 ఏండ్లలో ఎక్కడా లేనంటువంటి పథకాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టారు. రైతుబంధుతో రైతుల జీవితాలు మారిపోయాయి. ఈ చారిత్రక సందర్భాన్ని ప్రపంచానికి చాటాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
రైతుబంధు వారోత్సవాల సందర్భంగా రైతులు, అధికారులు, పార్టీ శ్రేణులతో మంత్రి నిరంజన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఒకప్పుడు 20,30 ఎకరాలున్న రైతుకూడా కంట్రోల్ బియ్యం కోసం ఎదురు చూసిన పరిస్థితి ఉండేదన్నారు. సమైక్య రాష్ట్రంలో అత్యంత ఎక్కువ నష్టపోయింది పాలమూరు జిల్లా అని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ ముందు చూపుతో ఇప్పుడు వ్యవసాయం, రైతాంగం పరిస్థితి మారిపోయిందన్నారు. వ్యవసాయ రంగం బలపేతం కావడంతో దాని అనుబంధ రంగాలతో పాటు అనేక రంగాలు బలోపేతమయ్యాయని మంత్రి పేర్కొన్నారు.
ఎనిమిదో విడత రైతుబంధు పథకం కింద ఇప్పటికి రూ.5 వేల కోట్లు రైతుల ఖాతాలలోకి చేరాయి. ఈ నెల 10 వరకు రైతుబంధు నిధుల పంపిణీ పూర్తవుతుందన్నారు. దీంతో ఎనిమిది విడతల్లో రూ.50,682 కోట్లు రైతులకు ఇచ్చినట్లు అవుతుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రపంచంలోని ఏ ప్రభుత్వం ప్రత్యక్ష్యంగా ఇలా రైతులకు ఇన్ని డబ్బులు ఇచ్చిన దాఖలాలు లేవు.
కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్ఫూర్తి రైతుబంధు పథకం కావడం విశేషమన్నారు. ఈ నేపథ్యంలో నేటి నుంచి ఈ నెల 10 వరకు రైతుబంధు వారోత్సవాలు నిర్వహించాలన్నారు. అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు ఇందులో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు.
గ్రామాల్లో మారిన రైతు పరిస్థితి, వ్యవసాయ శాఖ ముఖచిత్రాలపై ముగ్గులు వేయండి. ఎక్కడికక్కడ సృజనాత్మకతను ప్రదర్శించి తెలంగాణ వ్యవసాయ విజయాలను ప్రపంచానికి చాటాలని మంత్రి పిలుపునిచ్చారు.