హైదరాబాద్ : రైతన్నల వెన్నెముకను విరగొట్టి..వ్యవసాయాన్ని విధ్వంసం చేసేలా బిజెపి ప్రభుత్వం నల్లచట్టాలను తీసుకొచ్చింది. నల్ల చట్టాలపై రైతులు అలుపెరగక చేసిన పోరాట ఫలితమే ఈ నల్ల చట్టాల రద్దు అని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. అన్నదాతల పోరాటంతో దిగొచ్చి మోదీ ప్రభుత్వం మూడు నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ..ఈ చట్టాల వల్ల రైతుకు తీరని నష్టం జరుగుతుందన్నారు. వెంటనే ఈ చట్టాలను రద్దు చేయాలని సీఎం కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తు చేశారు. చట్టాల రద్దు కోసం ఉద్యమాలు, ధర్నాలు చేశారని, ఫలితంగా కేంద్రం ఈ చట్టాలను రద్దు చేయడం అంటే సీఎం కేసీఆర్, రైతు మద్దతు పోరాటాల విజయమని తెలిపారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుకు బాసటగా నిలిచి రైతుబంధు, రైతుబీమా, ఉచితంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ ద్వారా పుష్కలమైన సాగునీరు, ఎరువుల లభ్యత, నకిలీ విత్తనాలు అమ్మకుండా పి.డి యాక్టు తీసుకురావడం, వ్యవసాయ విస్తరణాధికారులను నియమించడం, రైతువేదికలు, రైతు కల్లాలు నిర్మించడం వంటి అనేక రైతుసంక్షేమ కార్యక్రమాలతో వ్యవసాయాన్ని సీఎం కేసీఆర్ పండగ చేశారన్నారు.
కానీ, బిజెపి ప్రభుత్వం రైతుల నడ్డివిరుస్తూ, వ్యవసాయాన్ని కార్పోరేట్ శక్తులకు కట్టబెడుతూ తెచ్చిన చట్టాలతో రైతులు ఆందోళన బాట పట్టారన్నారు. అన్నదాతలు అలుపులేని పోరాటాలు చేసి పంజాబ్ కేంద్రంగా గురునానక్ జయంతి రోజున నల్లచట్టాలను రద్దు చేయించడంలో విజయవంతమైన సందర్భంగా దేశ రైతులందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.