హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్పై బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్రావు పెదవి
విరిచారు. ఇదొక ఝూటా బడ్జెట్ అని, బోగస్ బడ్జెట్ అని ఆయన మండిపడ్డారు. ఈ బడ్జెట్తో ప్రభుత్వం
అన్ని వర్గాల వారిని మోసం చేసిందని విమర్శించారు. ఉద్యోగుల సమస్యలను, ఆర్టీసీ కార్మికుల సమస్యలను, నిరుద్యోగల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. వృద్ధులకు, వికలాంగులకు ఇచ్చిన పించన్ పెంపు హామీలను కూడా సర్కారు మరిచిపోయిందని ఎద్దేవా చేశారు. మహిళలకు నెలకు రూ.2,500 పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
ఈ బడ్జెట్లో సకలజనుల దక్కింది గుండు సున్నా తప్ప ఏమీ లేదని హరీష్రావు విమర్శించారు.
అంకెలగారడీ, మాటల గారడీ తప్ప ప్రభుత్వానికి పేదలపట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదనే విషయం ఈ బడ్జెట్
ద్వారా అర్థమవుతోందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ప్రజలకు అభయహస్తమని హామీ ఇచ్చారని,
ఇప్పుడు మూడో బడ్జెట్లో కూడా రిక్తహస్తమే మిగిల్చారని ఆరోపించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి
వచ్చిన మూడేళ్లు కాలేదుగానీ మూడున్నర లక్షల కోట్లు అప్పులు చేసిందని, తెచ్చిన ఆ అప్పుతో ఏం చేశారని
ప్రభుత్వాన్ని నిలదీశారు.
బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెడితే.. కాంగ్రెస్ తన రెండున్నరేళ్ల పాలనలో వెనుకపడేసిందని హరీష్రావు విమర్శించారు. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా భట్టి అంబేద్కర్ సూక్తులు, రాజ్యాంగ విలువలను వల్లెవేశారని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను వెనుక కూసోబెట్టుకుని రాజ్యాంగ విలువల గురించి ఆయన మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు.