KCR | రాష్ట్రంలో కరువు పరిస్థితులకు అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. ఇవాళ సూర్యాపేట జిల్లాలో ప్రెస్మీట్ నిర్వహించిన ఆయన.. ఇది వచ్చిన కరువు కాదని, అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువని మండిపడ్డారు. ‘రాష్ట్రంలో పంటలు ఎండిపోవడానికి కారణం మీరు. కరెంటు లో వోల్టేజ్ సరఫరాకు కారణం మీరు. మీకంటే ముందు ఎనిమిదేండ్లు మేం బ్రహ్మాండంగా కరెంటు ఇచ్చినం. ఎనిమిదేండ్లు ఇచ్చిన కరెంటు ఇప్పుడెట్ల మాయమైంది’ అని కేసీఆర్ ప్రశ్నించారు.
‘మేం పదేండ్లు రైతులను మేం బ్రహ్మండంగా చూసుకున్నం. ఇప్పుడు వాళ్ల కండ్ల పొంటి నీళ్లు వస్తుంటే ఎట్ల చూడాలె. వాళ్లు బాధలు పడుతుంటే చూసి ఎట్ల ఊకోవాలె. ఇప్పుడే ఇట్లుంటే ముందుముందు ఎట్లుంటదని రైతులు భయాందోళన చెందుతున్నరు. అందుకే వాళ్లపక్షాన మేం నిలబడ్డం. డిసెంబర్ 9న రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తమన్నరు. డిసెంబర్ 9 పొయ్యి ఎన్నాళ్లయ్యింది..? ముఖ్యమంత్రి ఎక్కడున్నరు..? మీరు దొంగ హామీలు ఇచ్చి తప్పించుకోలేరు. మేం వెంటపడి తరుముతం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాక ఇడిసిపెట్టేది లేదు. బ్యాంకులోళ్లు రైతుల ముక్కుపిండి రుణాలు వసూలు చేస్తున్నరు. మీకు బాధ లేదా..? కనీసం రైతుల దుస్థితి గురించి ఆలోచనైనా చేస్తున్నరా..? రైతుల పక్షాన ఎవడు మాట్లాడెటోడు లేడు, అడిగేటోడు లేడని మీరు అనుకుంటున్నరా..?’ అని కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
‘నేను రైతులకు చేతులెత్తి దండం పెట్టి చెబుతున్నా. రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీ కోసం బీఆర్ఎస్ పార్టీ రణరంగమైనా సృష్టిస్తది. ప్రధాన ప్రతిపక్షంగా మీరు మాకు బాధ్యత ఇచ్చారు. కానీ ఎమ్మటే మాట్లాడితే ఓర్వలేని తనం అంటరని ఓపిక పట్టిన. ఇప్పుడు నాలుగో నెల వచ్చింది. లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నయ్ కాబట్టి చూస్తూ ఊరుకోలేక వచ్చిన’ అన్నారు. అదేవిధంగా వాగ్ధానలు ఎగవెడితే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ‘మీరు వాగ్ధానాలను ఎగవెట్టి ఊరేగుదాం అనుకుంటున్నరా..? వాగ్ధానాలు ఎగవెడితే బిడ్డా నిద్ర గూడ పోనియ్యం చెప్తున్నా’ అని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు.