హైదరాబాద్ సిటీబ్యూరో, మే 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కరోనా రోగులకు కావాల్సిన లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్(ఎల్ఎంవో) తరలింపులో దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) చర్యలు కొనసాగిస్తున్నది. ఇప్పటికే రెండు ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ల ద్వారా రాష్ర్టానికి ఆక్సిజన్ తీసుకొచ్చింది. ఆదివారం సనత్నగర్లోని న్యూగూడ్స్ కాంప్లెక్స్ నుంచి మూడో ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైలు ఒడిశాకు బయలుదేరినట్టు ఎస్సీఆర్ సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ వెల్లడించారు. ఇందులో ఐదు ఖాళీ ట్యాంకర్లను పంపిస్తున్నామని తెలిపారు. రాకపోకల కోసం ఒడిశా వరకు గ్రీన్కారిడార్ను ఏర్పాటుచేసినట్టు చెప్పారు. ఇప్పటికే రెండు ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైళ్ల ద్వారా దాదాపు 127 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను తీసుకొచ్చామని తెలిపారు. దేశవ్యాప్తంగా దాదాపు 52కు పైగా ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైళ్ల ద్వారా 4వేల మెట్రిక్టన్నుల ఎల్ఎంవోను తరలించినట్టు రైల్వే అధికారులు పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ప్రత్యేక రైళ్ల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.