సోషల్ ఇంజినీరింగ్ స్కాంలతో రెచ్చిపోతున్న దొంగలు
ఆన్లైన్ షాపింగ్ అంటూ క్యూఆర్ కోడ్స్తో ఎర
డబ్బులు పంపుతామంటూ మన ఖాతాలో సొమ్ము చోరీ
హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు సరికొత్త పంథాలో రెచ్చిపోతున్నారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా మన వేలితో మన ఖాతా నుంచే దర్జాగా డబ్బులు కొట్టేస్తున్నారు. గూగుల్పే, ఫోన్పే, పేటీఎం, ఫ్రీచార్జ్ వంటి యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) ద్వారా జరిగే లావాదేవీలే టార్గెట్గా ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు. మనల్ని గందరగోళపరిచి, మానసిక ఒత్తిడిలోకి నెట్టేసి అందినకాడికి దోచుకెళ్తున్నారు. ఈ తరహా మోసాలను ‘సోషల్ ఇంజినీరింగ్ స్కామ్స్’గా సైబర్ క్రైం నిపుణులు చెప్తున్నారు.
నమ్మితే నట్టేట మునిగినట్టే
మనం ఏదైనా వస్తువును ఆన్లైన్లో విక్రయానికి పెట్టగానే వీరు తమ పని మొదలుపెడతారు. మనకు కాల్ చేసి.. ఆ వస్తువు కొంటామంటూ మాట కలుపుతారు. మెల్లగా మన వాట్సాప్ నంబర్ తీసుకొని.. వారేదో సంస్థలో పనిచేస్తున్నట్టు నకిలీ ఐడీ కార్డును మన వాట్సప్కు పంపుతారు. మనం నమ్మినట్టు గుర్తించగానే అసలు మోసానికి తెరలేపుతారు. మనకు ఫోన్ చేసి.. ‘నేను చాలా బిజీగా ఉన్నాను. ప్రస్తుతం 15 నిమిషాల బ్రేక్ ఉన్నది. ఈ లోగా మీ వస్తువును కొనేందుకు అడ్వాన్సుగా డబ్బు పంపుతాను’ అంటూ నమ్మకం కలిగిస్తారు. ఆ తర్వాత ‘నేను ఓ క్యూఆర్ కోడ్ను మీకు పంపుతున్నాను. దాన్ని స్కాన్చేసి పిన్ ఎంటర్ చేయగానే మీ ఖాతాలోకి డబ్బులు వస్తాయి’అని చెప్తారు. మనం ఆ మాటలను నమ్మి వారు చెప్పినట్టు చేస్తే ఇక అంతే సంగతులు. మన ఖాతాలో డబ్బులు కట్ అయ్యాయని తెలిశాక ఫోన్చేసి అడిగితే.. ‘పొరపాటు వల్లనో లేక యాప్ అప్డేట్ కావడం వల్లనో అలా జరిగి ఉండొచ్చు. అడ్వాన్సుతోపాటు మీ సొమ్మును తిరిగి చెల్లిస్తాం’ అని నమ్మబలికి మరోసారి క్యూఆర్ కోడ్ పంపుతారు. మనం మళ్లీ దీన్ని స్కాన్చేసి పిన్ ఎంటర్ చేస్తే మన ఖాతా నుంచి మరింత డబ్బు పోవడం ఖాయం. ఇలా అమాయకుల నుంచి నాలుగైదు సార్లు కూడా సైబర్ నేరగాళ్లు డబ్బులు కొట్టేస్తున్నట్టు సైబర్ క్రైం నిపుణులు చెప్తున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూతురు సైతం ఇదే విధంగా ఓ సోఫా విక్రయించేందుకు ప్రయత్నించి రూ.34 వేలు పొగొట్టుకున్నారు. ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి
సులభంగా చెప్పాలంటే.. మనం చెక్ ద్వారా ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటేనే చెక్పై మనమే సంతకం పెడతాం. అదే ఇతరులు మనకు చెక్ ఇస్తే దానిపై వారే సంతకం
పెడతారు. దానిపై మనం సంతకం చేయాల్సిన అవసరం ఉండదు. అచ్చంగా ఇలాగే మనం ఆన్లైన్లో డబ్బు పంపేటప్పుడు మన పిన్నే ఎంటర్ చేయాలి. ఎదుటివారే మనకు డబ్బు పంపేటట్టయితే మనం పిన్ను ఎంటర్ చేయనక్కర్లేదు. ఈ చిన్న వాస్తవాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి.
మనం పాటించాల్సిన జాగ్రత్తలు
మనకు క్యూఆర్ కోడ్ వచ్చినప్పుడు దాని ద్వారా మనకు డబ్బులు వస్తున్నాయా? లేక మనమే ఎదుటివారికి పంపుతున్నామా? అనేది ఉంటుంది. దీన్ని తప్పకుండా గమనించాలి.
క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత మనం పిన్ను ఎంటర్ చేయగానే మన ఖాతా నుంచి ఎదుటివారికి డబ్బులు వెళ్తాయి. అందుకే మనకు పంపిన క్యూర్ కోడ్ను స్కాన్చేసి పిన్ ఎంటర్ చేయాలని సైబర్ నేరగాళ్లు అడుగుతారు. అలా అడిగితే కచ్చితంగా మోసమేనని మనం గ్రహించాలి.