హసన్పర్తి, జనవరి 22: హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం అనంతసాగర్లోని ఎస్సార్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు. ఎస్సై భరత్ కుమార్ తెలిపిన ప్రకారం.. సూర్యాపేట జిల్లా మద్దిరాలకు చెందిన తోట చరణ్(బీటెక్), తోట మధు (ఇంటర్), మరో వ్యక్తి కలిసి జల్సాలకు అలవాటుపడి తమ సెల్ఫోన్లను వేరే చోట తాకట్టు పెట్టారు. తమ సెల్ఫోన్లను ఎలాగైనా విడిపించుకోవడానికి దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో ఎస్సార్ యూనివర్సిటీలోని లేడీస్ హాస్టల్లోకి చొరబడి ల్యాప్టాప్, 3 సెల్ ఫోన్లను చోరీ చేశారు. గోడదూకి పారిపోతున్న క్రమంలో చరణ్ బావిలో పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు తాడు సహాయంతో చరణ్ను పైకి తీశారు. మధు పంట పొలాల్లో నుంచి పారిపోతుండగా పట్టుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నట్టు ఎస్సై తెలిపారు.