కామారెడ్డి: పనిచేస్తున్న గుడిలోనే దొంగతనం చేయాలనుకున్నాడో వ్యక్తి. అయితే హుండీలో చెయ్యి ఇరుక్కుపోవడంతో దొరికిపోయిన ఘటన కామారెడ్డి (Kamareddy) జిల్లా బిక్కనూరు మండలంలో జరిగింది. మండలంలోని రామేశ్వరపల్లిలో ఉన్న మాసుపల్లి పోచమ్మ ఆలయంలో సురేశ్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో హుండీలో ఉన్న డబ్బును ఎత్తుకెళ్లాలని దురాలోచన చేశాడు.
ఇంకేముంది మంగళవారం రాత్రి ఆలయంలోకి ప్రవేశించాడు. హుండీ పైభాగాన్ని ధ్వంసం చేసి అందులోనుంచి డబ్బును బయటకు తీయడానికి ప్రయత్నించాడు. అయితే చెయ్యి అందులో ఇరుక్కుపోవడంతో తీయడానికి శ్రమించాడు. ఎంతకూ అది బయటకు రాకపోవడంతో అలాగే ఉండిపోయాడు. ఉదయం అతడిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కట్టర్ సహాయంతో హుండీని కత్తిరించి చెయ్యిని బయటకు తీశారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు.