హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): పాదయాత్ర పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఆయన మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో లేరని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. బుధవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. లోక్సభ సభ్యుడైన బండి సంజయ్ ఇంత నీచంగా మాట్లాడటం భావ్యం కాదని, ఆయన చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలేనని స్పష్టం చేశారు.
మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, చట్టం అందరికీ ఒకటే ఉంటుందని, పాత నగరానికొకటి..ఇతర ప్రాంతాలకు మరొకటి ఉండదని చెప్పారు. తెలంగాణలో ఏ పథకాలు అమలు కావడం లేదంటున్న ఆయన..వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. బీజేపీది దొంగల ప్రభుత్వమని, దుర్మార్గ పాలన అని, ప్రభుత్వ ఆస్తులు అమ్మడమే వారి పని అని ధ్వజమెత్తారు. మహారాష్ట్రలో 90 నిమిషాలకు ఓ రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడని, దేశాన్ని రక్షించాలంటే కేసీఆర్ నాయకత్వమే కావాలని చెప్పారు. వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే విద్య, వైద్యం ఉచితం అంటున్నారని, మరి ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. సంక్షేమ పథకాల అమలుపై బహిరంగ చర్చకు సిద్ధమా అని ఆయన సంజయ్కు సవాల్ విసిరారు.