సిరిసిల్ల టౌన్, మార్చి 16 : ‘ఉపాధి కల్పించి అండగా ఉంటమని చెప్పిన్రు. పెట్రోల్ బంక్లో పనిచేయించుకున్నరు. జీతాలు మాత్రం సక్కగా ఇస్తలేరు. ఆరేడు నెలలైంది. కుటుంబాలను ఎట్ల పోషించుకోవాలే. జీతాలు అడిగితే డీడబ్ల్యూవో కేసులు పెట్టి జైలుకు పంపుతానని బెదిరిస్తున్నడు’ అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని పెట్రో ల్ బంక్లో పనిచేసే దివ్యాంగులు వాపోయారు. కనికరంలేని ఇటువంటి అధికారిపై చర్యలు తీసుకోండి సార్ అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని వేడుకున్నారు. ‘మీ కాళ్లు మొక్కుతం .. మా జీతాలు ఇయ్యండి సార్’ అంటూ జిల్లా సంక్షేమశాఖ అధికారి లక్ష్మీరాజం కాళ్లపై పడి ప్రాధేయపడ్డారు. శనివారం సిరిసిల్లలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని రెండో బైపాస్ రోడ్డులో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేశారు. అందులో 24 మందిని దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లను నియమించారు.
2024లో అప్పటి కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తర్వులు ఇచ్చారు. అప్పటి నుంచి పనిచేస్తున్నా వీరికి సక్రమంగా జీతాలు ఇవ్వడంలేదు. ఒక్కొక్కరికి ఆరేడు నెలల నుంచి ఇవ్వాల్సి ఉన్నది. ఈ క్రమంలో విసిగిపోయిన దివ్వాంగులు సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. మున్సిపల్ అధికారులు సమాచారం ఇవ్వడంతో జిల్లా సంక్షేమశాఖ అధికారి (డీడబ్ల్యూవో) అక్కడకు చేరుకున్నారు. ఆడిట్ చేసిన తర్వాత వేతనాలు ఇస్తామని ఆయన చెప్పగా, దివ్యాంగులు తీవ్ర నిరాశ చెందారు. ప్రతిసారి ఇదే చెబుతున్నారని, జీతాలు మాత్రం ఇవ్వడంలేదని మండిపడ్డారు. ‘మీ కాల్మోక్తం.. మా జీతాలు మాకివ్వండి’ అంటూ కాళ్లపై పడి ప్రాధేయపడ్డారు. దీంతో ఆ అధికారి ఐదు రోజుల్లోగా సమస్యను పరిష్కరిస్తానని చెప్పి వెళ్లిపోయారు.